ఏపి కేబినెట్ భేటీ ఈ నెల 29న జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 29 (సోమవారం) ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయ భవనంలోని కెబినెట్ మీటింగ్ హాలు జరుగు మంత్రివర్గ సమావేశానికి తమ శాఖలకు సంబంధించిన అంశాలను వెంటనే పంపాలని సీఎస్ కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. ఇంతకు ముందే వర్షాకాల సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించినా వరదల కారణంగా నిర్వహించలేదు.
ఈ సమావేశాలతో పాటు ముఖ్యమైన బిల్లులను ఆమోదించుకునేందుకు కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తొంది. ఇదే సమావేశంలో మూడు రాజధానుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అని మంత్రులు పదేపదే స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఉప సంహరించుకున్న సమయంలోనే మెరుగైన బిల్లు తీసుకువస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అయితే హైకోర్టు తీర్పు తర్వాత దానిపై ముందడుగు పడలేదు.
ఇక ఎన్నికలకు సిద్ధపడుతున్న వేళ ప్రభుత్వానికి పోలవరం, మూడు రాజధానుల అంశాలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. అందుకే ఈ అంశాలను పదేపదే ప్రధాన మంత్రి మోడీ దృష్టికి సీఎం జగన్ తీసుకువెళుతున్నారు. ప్రభుత్వ మైలేజ్ మరింత పెంచుకునే క్రమంలో భాగంగా నియోజకవర్గాల్లో, గ్రామ వార్డు సచివాలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా సెప్టెంబర్ రెండవ వారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సూత్రప్రాయం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.
ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఏపీ సీఎం వైఎస్ జగన్ .. కీలక ట్విస్ట్ ఏమిటంటే..?