AP Cabinet Meet: ఈ నెల 3వ తేదీ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేస్తూ ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశాన్ని తిరిగి మార్చి 7వ తేదీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది. మంత్రివర్గ సమావేశం నిర్వహణకు సంబంధించి మార్పులను గమనించాల్సిందిగా అన్ని శాఖల కార్యదర్శులకు సూచనలు జారీ చేసింది. 3వ తేదీ దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి పెద్ద కర్మ ఉండటంతో..కేబినెట్ భేటీని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
AP Cabinet Meet: 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు
మంత్రి గౌతమ్ రెడ్డి మరణానికి ముందే మార్చి 3వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దుబాయ్ పర్యటన ముగించుకుని వచ్చిన మంత్రి గౌతమ్ రెడ్డి ఫిబ్రవరి 21న గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందారు. ఆ తర్వాత మంత్రి మృతికి సంతాపంగా ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఫిబ్రవరి 23న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు ముగిశాయి. కాగా మార్చి 7వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై..?
ఈ సమావేశంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలుపనుంది. ప్రధానంగా ఈ కేబినెట్ భేటీలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుతో నూతన జిల్లాల ఏర్పాటు తదితర కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి 7వ తేదీ నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల గురించి వివరించి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సోమవారం సీఎం జగన్ దంపతులు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు