AP Cabinet Meet: ఏపి కేబినెట్ ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో 39 కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలను తీసుకున్నారు. మైక్రో సాఫ్ట్ సహకారంతో 1.62 లక్షల మంది విద్యార్థులకు స్కిల్ డవలప్మెంట్ లో శిక్షణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 300 కళాశాలలు, స్కిల్ డవలప్మెంట్ సెంటర్లలో శిక్షణ ఇవ్వనున్న మైక్రో సాఫ్ట్..40 సర్టిపికేషన్ కోర్సుల్లో శిత్రణ ఇవ్వనుంది. రూ.30.79 కోట్లతో మైక్రో సాఫ్ట్ ప్రాజెక్టు అమలునకు కేబినెట్ ఆమోదించింది. అదే విధంగా ఏల్జీ పాలిమర్స్ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమను తొలగించాలని కేబినెట్ ఆదేశించింది ఆ భూముల్లో పర్యావరణ అనుకూల, ప్రమాద రహిత పరిశ్రమను నెలకొల్పేందుకు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి అనుమతులు మంజూరు చేసింది. అలాగే మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ నియామకానికి సంబంధించిన చట్ట సవరణను సైతం కేబినెట్ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పది మెగావాట్ల సౌర విద్యుత్ పొందేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే విధంగా వ్యవసాయ వినియోగానికే పదివేల మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. యూనిట్ కు రూ.2.49 కి సరఫరా చేసేలా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్ అండ్ బీకి చెందిన ఖాళీ స్థలాలు, భవనాలను ఆర్టీసీకి బదలాయించాలని కేబినెట్ ఆమోదించింది. వైఎస్ఆర్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గృహనిర్మాణానికి రూ.35వేల రుణ సదుపాయం, మూడు శాతం వడ్డీకే రుణాల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యా, వైద్య సదపాయాల దాతల పేర్లను 20 ఏళ్లు పెట్టే ప్రతిపాదనను కేబిటెన్ ఆమోదించింది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.
క్షేత్ర స్థాయిలో విస్తృత పర్యటనలు చేపట్టాలని మంత్రులను సీఎం జగన్ ఆదేశించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పెన్షన్ల కోత విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని మంత్రులను ఆదేశించారు. అర్హులకు మేలు జరిగేలా లబ్దిదారుల ఎంపిక జరుగుతోందని ప్రజలకు వివరించాలని సూచించారు.