ఏపి కెేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 13వ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. 13న ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సచివాలయంలో భేటీ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తొమ్మిదవ తేదీలోగా ఆయా శాఖలకు చెందిన అంశాలపై ప్రతపాదనలు పంపాలని సీఎస్ కార్యాలయం అన్ని శాఖలను ఆదేశించింది. కాగా ఈ కేబినెట్ భేటీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి చర్చించనున్నది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం, ముందస్తు ఎన్నికలు అటు ప్రజల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉన్న నేపథ్యంలో మంత్రివర్గం ఈ అంశాలపై చర్చించనున్నదని తెలుస్తొంది. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేసి తీరుతామని ఇప్పటికే పలువురు మంత్రులు, రాష్ట్ర పెద్దలు పలు సందర్బాల్లో ప్రకటించి ఉన్నారు. దానికి తోడు రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన ఎస్ఎల్పీ విచారణ సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా పలు అంశాలపై స్టే ఇవ్వడంతో, శీతాకాల సమావేశాల్లోనే మెరుగైన రీతిలో వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజధాని అంశం రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అంశం అంటూ ఏపి హైకోర్టుకు గతంలో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి ఉండటం, సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటంతో ఈ అంశంలో ముందుకే వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తొంది.
రాజధాని ఎక్కడ ఉండాలనే విషయాన్ని న్యాయస్థానాలు నిర్దేశించలేవని, అలాంటి ఆదేశాలు జారీ చేయడానికి కోర్టులు టౌన్ ప్లానింగ్ కార్యాలయాలు కావని కూడా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో గతంలో ఉపసంహరించుకున్న వికేంద్రీకరణ బిల్లు స్థానంలో మెరుగైన బిల్లు ను తీసుకువచ్చేదానిపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తొంది. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు తదితర కీలక విషయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలకు భూముల కేటాయింపులతో పాటు సంక్షేమ పథకాలపై కేబినెట్ చర్చించనున్నారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు, తాము ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనే ఉన్నామంటూ మంత్రి సిదిరి అప్పలరాజు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ముందస్తు ఎన్నికలకు సూచనగానే తెలుస్తొంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. వైసీపీతో సహా ప్రధాన రాజకీయ పక్షాలు జనాల్లో తిరుగుతున్నాయి. అందుకే షెడ్యుల్ ప్రకారం ఎన్నికల జరిగే వరకూ ఆగడమా లేక ముందస్తు ఎన్నికలకు వెళ్లడమా అనే దానిపైనా జగన్మోహనరెడ్డి మంత్రివర్గంలో చర్చిస్తారని అనుకుంటున్నారు.