AP Capital: ఏపిలో మూడు రాజధానుల అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ అధికార, ప్రతిపక్షాలు దీనిపై మాట్లాడుతూనే ఉన్నారు. మూడు రాజధానుల విషయంలో కోర్టును ఒప్పించి విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తామంటూ మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అంటున్నారు. ఇతర ప్రాంత వైసీపీ నేతలు ఎవరూ పెద్దగా ఈ అంశంపై మాట్లాడటం లేదు కానీ మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితర ఉత్తరాంధ్ర ప్రాంత వైసీపీ నేతలు విశాఖ పరిపాలనా రాజధాని అంటూ మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ కూడా మూడు రాజధానులకు ప్రధాన మంత్రి మోడీ మద్దతు ఉందంటూ వ్యాఖ్యానించారు. మోడీ ఆమోదం తీసుకున్న తరువాతే సీఎం జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేశారని అంటున్నారు. రైతులను అవమానించేలా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారనీ, ఈ ప్రభుత్వం చట్టబద్దమైన ఒప్పందాలను గౌరవించదా అని రామకృష్ణ ప్రశ్నిస్తున్నారు.
AP Capital: బీజేపీ,జనసేన సైలెంట్ కావడానికి కారణం అదేనా..
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు పలికారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే ఉండాలని తీర్మానం కూడా చేశారు. అదే విధంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాజధాని అమరావతి రైతుల పక్షాన నిలబడతానని ఆ ప్రాంతంలో పర్యటించి హామీ కూడా ఇచ్చారు. బీజేపీ, జనసేన ఉమ్మడి కార్యచరణ తీసుకుంటామని కూడా ప్రకటించి వెనక్కు తగ్గారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమకు ఏమి సంబంధం లేదన్నట్లుగానే మొదటి నుండి వ్యవహరిస్తోంది. ఆ మేరకు హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని తేల్చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ వైఖరి ఏమిటనేది తేలిపోవడంతో బీజేపీ – జనసేన మూడు రాజదానుల అంశంపై పెద్దగా మాట్లాడటం లేదు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎటువంటి స్పందన లేకపోయినా అమరావతి ప్రాంత రైతాంగం మాత్రం తమ ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు.
త్వరగా వివాదం తెలుతుందా..ఇరువర్గాలకు హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు లేదూ..
హైకోర్టులోనే రెండేళ్లు అవుతున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మారటంతో గతంలో జరిగిన వాద ప్రతివాదనలు మళ్లీ మొదటికి వచ్చాయి. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టులో మొత్తం 57 పిటిషన్లు విచారణలో ఉన్నాయి. ఈ పిటిషన్ లపై నవంబర్ 15 తరవాత హైకోర్టులో రోజా వారి విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే హైకోర్టులో ఎవరికి తీర్పు వ్యతిరేకంగా వచ్చినా వారు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. హైకోర్టులోనే రెండేళ్లకు పైగా తేలని పరిస్థితుల్లో ఈ వివాదం సుప్రీం కోర్టుకు వెళితే ఎన్నాళ్లకు తేలుతుందో అన్న అనుమానాలు కూడా అటు రాజకీయ పక్షాల్లో, ఇటు ప్రజానీకంలో ఉన్నాయి. అయితే కోర్టులో విచారణ తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహనరెడ్డి సర్కార్ మాత్రం ఏ విధంగా విశాఖ నుండి పరిపాలన స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఉంది. ఈ వ్యవహారం కోర్టులో ఇలా కొనసాగుతూ ఉండగానే సీఎం క్యాంప్ కార్యాలయం విశాఖలో ఏర్పాటు చేసి జగన్ అక్కడ నుండి పరిపాలన చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటునటు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు, కోర్టు తప్పుపట్టే అవకాశం ఉండదు. ఒన్ ఫైన్ మార్నింగ్ ఇదే జరుగుతుందేమో చూడాలి మరి.!
ఇవి కూడా చదవండి…
2. YV Subba Reddy: టీటీడీలో నిత్య అన్నదాన పథకం అమలుపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇదీ..
3. CM KCR: సెప్టెంబర్ 1న హస్తినకు పయనమవుతున్న తెలంగాణ సీఎం కేసిఆర్..! ఎందుకంటే..?