AP Capital Issue: అటు కేంద్ర, ఇటు రాష్ట్ర పాలకుల తీరుపై సీబీఐ మాజీ జేడి వీవీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా ఆయన నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఆయన పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు. ఈ పాదయత్రలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం విశేషం అన్నారు. దేశ స్వాతంత్రం తరువాత ఇంత మంది మహిళలు పాదయాత్రలో పాల్గొనడం ఇదే మొదటిదన్నారు. ఈ మహిళలు, రైతులు వారి వ్యక్తిగత ఎజండాతో ఈ పాదయాత్ర చేయడం లేదనీ. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, రాష్ట్రానికి రాజధాని ఉండాలి అని పాదయాత్ర చేస్తున్నారు. రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి, రాజధాని అభివృద్ధి జరిగితే పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు వస్తాయి, తద్వారా నిరుద్యోగ సమస్య తీరుతుందని అన్నారు. శాసనసభలో, పార్లమెంట్ లో అనేక మోసాలు జరుగుతున్నాయన్నారు.
AP Capital Issue: ప్రత్యేక హోదా మాట తప్పారు
ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ లో మనం అంతా టీవీలు చూస్తుండగా చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక హోదా మేము చెప్పలేదు, ఇవ్వలేము, 14వ ఆర్ధిక సంఘం ఒప్పుకోలేదని అంటున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆర్ధిక సంఘం అడ్డు చెప్పేదేమి ఉంటుందని ప్రశ్నించారు. శాసనసభలు, చట్ట సభలు ప్రజల విశ్వాసాన్ని కల్గించేలా ఉండాలన్నారు. గత ప్రభుత్వం రైతుల వద్దకు వచ్చి రాజధాని నిర్మిస్తున్నాం భూములు కావాలని తీసుకుందన్నారు. రైతులు ఎప్పుడూ కూడా రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి కోరుకుంటారని పేర్కొన్నారు. గతంలో విశాఖ స్టీల్ నిర్మాణానికి రైతులు భూములు ఇచ్చారు. కానీ ఇప్పటికీ 8500 మంది రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. రైతు ఎప్పుడూ నష్టపోతుంటారు కానీ అది నష్టం అని అనుకోడు, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అని కోరుకుంటారని అన్నారు. ప్రభుత్వాలు దీనికి బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం మారినంత మాత్రాన విధానాలు మారకూడదు. అధికారులు, ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా విధానాలు మారకూడదన్నారు. ప్రభుత్వాలు మాటలు మార్చడం నిర్ణయాలను వెనక్కు తీసుకోవడం వల్ల వివాదం న్యాయస్థానాల్లోకి వెళుతుందన్నారు. గత పాలకులు గానీ ఇప్పటి పాలకులు గానీ ఇచ్చిన మాటలను వెనక్కు తీసుకుంటే బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. అయితే దీని వల్ల నిర్ణయాలను మనం ఎన్నుకున్న పాలకులు తీసుకుంటారా. న్యాయస్థానాలు తీసుకుంటాయా అన్న అనుమానం వస్తుందనీ, ఇటువంటి పరిస్థితులను పాలకులు తీసుకురాకూడదన్నారు.
జిల్లాకో రాజధాని బెస్ట్
రాష్ట్రానికి మూడు కాదు 13 రాజధానులు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక్కో జిల్లాకు ఒక్కో రాజధానిగా అభివృద్ధి చేస్తే మంచిదన్నారు. ఈస్ట్ గోదావరి జిల్లా ఆక్వా, వరి రాజధానిగా, రాయలసీమ ఖనిజాల కేపిటల్, ఐటీ కేపిటల్ విశాఖ, జీడిపప్పు, కొబ్బరి కేపిటల్ శ్రీకాకుళం జిల్లా ఇలా ఒక్కో జిల్లాకు ఒక్కో కేపిటల్ గా అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని లక్ష్మీనారాయణ అన్నారు. ఇక హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ అమరావతిలో ఉన్నందున విశాఖకు ఒక బెంచ్, కర్నూలుకు మరో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటే ఆయా ప్రాంతాల వాళ్లు అక్కడికి వెళతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బిల్లులో జిల్లాకో కేపిటల్ గా అభివృద్ధి చేస్తామని ప్రకటిస్తే ప్రజలందరూ హర్షిస్తారన్నారు. శాసన రాజధాని అమరావతిలోనే ఉంచి ఒక సెషన్ విశాఖలో, మరో సెషన్ రాయలసీమలో నిర్వహించవచ్చన్నారు. మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్ లో ఈ తరహా విధానం ఉందన్నారు. 2024 వరకే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, ఆ తరువాత ఏపికి కేపిటల్ ఏది అంటే ఏమిచెబుతామని ప్రశ్నించారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలనీ ఆ తరువాత రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధికి పాలకులు కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వాలు ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా పరిపాలన సాగించాలన్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాల బిల్లును ఉపసంహరించుకున్న విషయాన్ని గుర్తు చేశారు.