AP Capital Issue: ఏపి మూడు రాజధానుల అంశంపై హైకోర్టు నిన్న కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై భిన్నవాదనలు వినబడుతున్నాయి. వైసీపీ మినహా ఇతర రాజకీయ పక్షాలు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాయి. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్ర పరిధిలోనిది అని చెబుతుంటే హైకోర్టు ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పడం ఏమిటని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అయితే హైకోర్టు తన తీర్పులోనే రాజధానిని మార్చాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయాలో కూడా తెలిపింది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మూడు రాజధానులుగా మార్చాలనుకుంటే కేంద్రానికి లేదా పార్లమెంట్ కు విజ్ఞప్తి చేసి, ఏపి పునర్విభజన చట్టానికి సవరణ కోరవచ్చని తెలిపింది.
AP Capital Issue: పార్లమెంట్ కే పూర్తి అధికారం
హైకోర్టుతో సహా శాసన, న్యాయ, కార్యనిర్వహక వ్యవస్థలకు సంబంధించి ప్రధాన కార్యాలయాలను ఏపి సీఆర్డీఏ చట్టం, ల్యాండ్ పూలింగ్ నిబంధనల కింద నోటిఫై చేసిన ప్రాంతంలో తప్ప మరో చోటకు మార్చే ఆధికారం కూడా రాష్ట్రానికి లేదని చెబుతూ, ఆ అధికారం పూర్తిగా పార్లమెంట్ కు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే క్రమంలో అమరావతి నుండి కార్యాలయాల తరలింపును నిరోధిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. మాస్టర్ ప్లాన్ ను సుమోటోగా సవరించే అధికారం సీఆర్డీఏకు లేదని చెబుతూ.. అలా చేసినందుకు సీఆర్డీఏకు జరిమానా విధించింది. ఒక్కో పిటిషనర్ కు రూ.50వేల వంతున కోర్టు ఖర్చులను చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
AP Capital Issue: సుప్రీం కోర్టుకా..? పార్లమెంట్ కా..?
హైకోర్టు తీర్పు అనంతరం కూడా ప్రభుత్వం మూడు రాజదానులకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ నిర్ణయంలో మార్పులేదని స్పష్టం చేశారు. హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత కూడా హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందా..? లేక పార్లమెంట్ ద్వారా చట్టసవరణకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతుందా..? అనేది వేచి చూడాలి.