AP Capital Issue: ఏపి మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపి హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైశ శైలిలో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు ఊహించిందేనని అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ అనేది తమ ప్రభుత్వ విధానం అని దానిలో ఏటువంటి మార్పు ఆలోచన లేదని మరో సారి స్పష్టం చేశారు. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అనే విషయాన్ని పార్లమెంట్ లో స్పష్టంగా చెప్పారని అన్నారు. రాజధాని అంటే భూములు, ఓ సామాజికవర్గం కాదని ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
AP Capital Issue: మూడు నెలల్లో ప్లాట్లు ఎలా ఇస్తారు..?
సీఆర్డీఏ చట్టం అమలునకు తాము వ్యతిరేకం కాదని పేర్కొన్న ఆయన..మూడు నెలల్లో ప్లాట్లు ఎలా ఇస్తారు..? ఏదైనా ప్రాక్టికల్ గా సాధ్యమవుతుందా.? లేదా..? చూడాలన్నారు. హైకోర్టు తీర్పు పూర్తిగా చదివాక వీటిపై స్పందిస్తానని అన్నారు. హైకోర్టు తీర్పుపై కొన్ని మీడియా సంస్థలు వక్రభాష్యం చెబుతున్నాయన్నారు. ఈ విషయంపై సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదనీ, అయినప్పటికీ దానిపై చర్చించి చెబుతామన్నారు.
AP Capital Issue: మూడు రాజధానులు ఏర్పాటు ప్రభుత్వ లక్ష్యం
రాజ్యాంగపరంగా చట్టపరిధిలో చట్టాలు చేసేందుకే శాసనసభ, పార్లమెంట్ ఉన్నాయని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ విధానమనీ, మూడు రాజధానుల ఏర్పాటునకు ఈ క్షణం వరకూ నిబద్ధతతో ఉన్నామని బొత్స పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు చూసిన తరువాత పూర్తి స్థాయిలో దీనిపై మాట్లాడతానని మంత్రి బొత్సా వెల్లడించారు.