AP CID Case : అమరావతి రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై గత ముఖ్యమంత్రి చంద్రబాబు, నాటి మంత్రి నారాయణ తదితరులపై ఏపి సీఐడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై విచారణకు హజరుకావాలంటూ సీఐడీ చంద్రబాబు, నారాయణలకు నోటీసులు జారీ చేసింది. సీఐడీ నోటీసులపై విచారణకు హజరు కావాలా వద్దా, కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలా అన్న అంశంపై పలువురు సీనియర్ న్యాయవాదులతో చర్చించిన చంద్రబాబు కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం చంద్రబాబు, నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సిఐడీ ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని వీరి తరుపు న్యాయవాదులు పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ లపై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు, నారాయణలపై ఐపీసీ 166,167,217, 120(బీ), రెడ్ విత్ 34, 35,36,37, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ 3(1) (ఎఫ్),(జీ), ఏపి అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ నెల 23వ తేదీ ఉదయం 11గంటలకు విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు రావాలని చంద్రబాబుకు సీఐడి డిఎస్పీ ఎ లక్ష్మీనారాయణ పేరుతో నోటీసులు జారీ అయ్యాయి.
చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇది కక్షసాధింపు చర్యలే అంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నారు. తప్పు చేయనప్పుడు విచారణకు భయపడాల్సిన అవసరం ఎందుకని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలు కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు విచారణలో ఏం చెబుతుంది అన్నదానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.