టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ట్రెండ్ సెట్ లోని విజయ్ ఇంటికి శనివారం ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో విజయ్ ఇంటిలో లేకపోవడంతో విజయ్ గురించి ఆయన పిల్లలను, పని మనిషిని ప్రశ్నించారు. అనంతరం 41 సీఆర్పీసీ ప్రకారం నోటీసులు అందజేశారు. ఈ నెల 6వ తేదీన మంగళగిరిలోని తమ కార్యాలయంలో సైబర్ క్రైమ్ విభాగంలో విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
మార్ఫింగ్ వీడియో అంశంపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గతంలో చింతకాయల విజయ్ సహా మరి కొందరిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా మాధవ్ ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తొంది. ఆ అంశంపైనే విచారణకు హజరు కాావాలని నోటీసులు ఇచ్చి ఉంటారని తొలత భావించారు. కానీ తాజాగా ఈ రోజు నమోదు చేసిన కేసులో నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసి నిందితులను కోర్టుకు హజరుపరుస్తున్న నేపథ్యంలో మెజిస్ట్రేట్ లు ఈ కారణంతో వెంటనే బెయిల్ మంజూరు చేస్తుండటంతో ఈ సారి సీఐడీ అధికారులు కేసులో నిందితులుగా ఉన్న వారికి 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారని అనుకుంటున్నారు.
అయితే విజయ్ కు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లు ట్విట్టర్ వేదికగా స్పందించారు. విజయ్ ఇంటికి వెళ్లిన సీఐడీ పోలీసులు దురుసుగా వ్యవహరించారని నారా లోకేష్ ఆరోపించారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి తనయుడు, టిడిపి యువనేత చింతకాయల విజయ్ ఇంట్లోకి దోపీడీ దొంగల్లా పోలీసులు చొరబడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు చంద్రబాబు. విజయ్ ఇంట్లో చిన్న పిల్లలను, పని వాళ్లను భయభ్రాంతులను చేసేలా సిఐడి పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని అన్నారు. బీసీ నేత అయ్యన్న పాత్రుడు కుటుంబంపై మొదటి నుంచీ జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో నర్సీపట్నంలో అయ్యన్న ఇంటిపై ఇలాగే దాడి చేశారన్నారు. రాష్ట్రంలో రోజుకో సిఐడి కేసు, వారానికో అరెస్టు తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు మరేమీ చెయ్యడం లేదని విమర్శించారు.
టీడీపీకి షాక్ .. ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్