వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ వీడియో వ్యవహారంపై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కక్షతో మార్ఫింగ్ చేసి వీడియోని సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఏపీ సీఐడికి ఎంపి గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. ఎంపి తన లెటర్ హెడ్ పై దర్యాప్తు జరిపించాల్సిందిగా సీఐడీ అడిషనల్ డీజికి లేఖ రాశారు. మార్ఫింగ్ వీడియోను ముందుగా ఐటీడీపీ సోషల్ మీడియా లో పోస్ట్ చేసిందని లేఖలో పేర్కొన్న గోర్లంట్ల మాధవ్.. ఆ సోషల్ మీడియా సైట్ టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో పని చేస్తుందనీ, దీనికి చింతకాయల విజయ్, నారా లోకేష్ చూస్తుంటారని తెలిపారు. ఎంపీ మాధవ్ ఫిర్యాదుతో సీఐడీ రంగంలోకి దిగింది. మాధవ్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నెం.12/2022 గా కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
గోరంట్ల మాధవ్ ది ఫేక్ వీడియో అని తేల్చిన ఏపీ పోలీసులు..!!
ఈ వీడియో వ్యవహారంపై గతంలోనే ఎంపి మాధవ్ మాట్లాడారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా చెప్పారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదనీ పేర్కొన్నారు. ఆ సందర్భంలో టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు కూడా చేశారు. ఈ వీడియో వ్యవహారంపై గత నెల మొదటి వారంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్ అయ్యింది. మళ్లీ కొందరు మహిళా నేతలు ఈ అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినతి పత్రం ఇవ్వడంతో రాష్ట్రపతి కార్యాలయం నుండి ఏపి ప్రభుత్వానికి లేఖ అందింది. ఇంతకు ముందు వీడియో వ్యవహారంపై అనంతపురం ఎస్పీ, సీఐడీ డీజీ మీడియా సమావేశం నిర్వహించి ఒరిజినల్ వీడియో లభిస్తేనే మార్ఫింగ్ వీడియోనా కాదా అనేది తెలుతుందని తెలిపారు. అది మార్ఫింగ్ కాదు అంటూ సర్క్యులేట్ అవుతున్న ల్యాబ్ రిపోర్టు కూడా ఫేక్ అని సీఐడీ డీజీ నాడు చెప్పారు. తాజాగా మాధవ్ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేయడంతో ఎవరెవరి పాత్ర వెలుగులోకి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.