టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త వెంగళరావుకు ఏపి సీఐడీ ప్రత్యేక కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సీఐడీ అధికారుల రిమాండ్ రిపోర్టును తిరస్కరించి వ్యక్తిగత పూచికత్తుతో వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది సీఐడీ ప్రత్యేక కోర్టు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు పెట్టారన్న ఆరోపణపై సీఐడీ అధికారులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకూ సీఐడీ కార్యాలయంలో ఆయన్ను విచారించారు. తర్వాత ప్రాధమిక వైద్య పరీక్షలు జరిపించి రాత్రి అతన్ని గుంటూరు ఆరవ అదనపు మెజిస్టేట్ శృతి ఎదుట ఆమె నివాసంలో హజరుపర్చారు. ఈ సందర్భంలో మెజిస్టేట్ వద్ద తనను సీఐడీ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించారని, బెదిరింపులకు గురి చేశారని వెంగళరావు ఆరోపించారు.
వెంగళరావు వ్యాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న మెజిస్ట్రేట్ .. నిందితుడికి గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు జరిపించి మరల హజరుపర్చాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో గుంటూరు జీజీహెచ్ లో వెంగళరావుకు వైద్య పరీక్షలు నిర్వహించిన సీఐడీ అధికారులు .. మధ్యాహ్నం తిరిగి సీఐడీ ప్రత్యేక కోర్టు లో హజరుపర్చారు. ఈ సందర్భంగా వెంగళరావు రిమాండ్ కు సంబంధించి సీఐడీ అధికారులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ తిరస్కరించారు. 41 సీఆర్పీసీ కింద నిందితుడికి నోటీసు ఇవ్వలేదనీ, నిబంధనలకు విరుద్దంగా జరిగే అరెస్టుల్లో రిమాండ్ రిపోర్టును అంగీకరించేది లేదని స్పష్టం చేస్తూనే నిందితుడు వెంగళరావుకు వ్యక్తిగత పూచీకత్తు తోనే బెయిల్ మంజూరు చేశారు. వెంగళరావు విడుదల అయిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనతో నేరుగా ఫోన్ చేసి పరామర్శించారు.
రీసెంట్ గా హైదరాబాద్ లోనూ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు 41 సీఆర్పీసీ నోటీసు ఇవ్వకుండానే పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హజురపరిస్తే మెజిస్ట్రేట్ ..ఎటువంటి షరతులు లేకుండా బెయిల్ మంజూరు చేస్తూ ఇంటి వద్ద దింపాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.