AP Cinema Tickets: ఏపిలో ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయాలపై ఏపి సర్కార్ శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల అమ్మకాలకు సంబంధించి నోడల్ ఏజన్సీగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం డవలప్మెంట్ కార్పోరేషన్ (ఏపిఎఫ్డీసీ) సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతల నిర్వహణ అప్పగించింది. ఇకపై రాష్ట్రంలోని థియేటర్లు ఏపిఎఫ్డీసీ తో అగ్రిమెంట్ చేసుకోవాలి. ప్రతి టికెట్ ధరపై 2 శాతంకు మించి సర్వీస్ చార్జి వసూలు చేయకూడదు. ఇప్పటికే ఆన్ లైన్ లో టికెట్లు అమ్ముతున్న సంస్థలు, సినిమా థియేటర్లు ఆ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. అయితే నోడల్ ఏజన్సీ నియమించిన సర్వీస్ ప్రొవైడర్ గేట్వే ద్వారానే విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం పేర్కొంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
AP Cinema Tickets: మౌళిక సదుపాయాలను థియేటర్ల యాజమాన్యాలే కల్పించాలి
సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్ ఫామ్ తో అనుసంధానమయ్యేందుకు కావాల్సిన మౌళిక సదుపాయాలను థియేటర్ల యాజమాన్యాలే కల్పించాల్సి ఉంటుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన 30 రోజుల్లోగా అన్ని థియేటర్ లలో నిబంధనలన్నీ కఛ్చితంగా అమలు కావాలని పేర్కొంది. లేకుంటే వారి లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించింది. సినిమా తొలి ప్రదర్శనకు ఏడు రోజుల ముందు నుండి మాత్రమే ఆన్ లైన్ ద్వారా టికెట్ల అమ్మకాలు ప్రారంభించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రతి టికెట్ పైనా.. జీఎస్టీ, సర్వీస్ టాక్స్ ఎంత వసూలు చేస్తున్నారనేది స్పష్టంగా ముద్రించాలని ప్రభుత్వం పేర్కొంది.
కాగా, సినిమా టెకెట్ల ధరలను నియంత్రించేందుకు, బ్లాక్ మార్కెటింగ్ నిరోధించేందుకు ప్రభుత్వమే ఆన్ లైన్ ద్వారా టికెట్లు అమ్మకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో రాష్ట్రంలో పెద్ద దుమారమే రేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, సినీ పరిశ్రమలోని కొందరు ఆరోపణలు, విమర్శలు చేశారు. కొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో అమ్మకాలకు కోర్టు అనుమతించింది. ఏపి స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డవలప్మెంట్ కార్పోరేషన్ (ఏపిఎస్ఎఫ్టీవిడీసి) ద్వారా ప్రభుత్వం ఆన్ లైన్ లో సినిమా టికెట్లు అమ్ముకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా గైడ్ లైన్స్ విడుదల చేసింది.