AP Cinema: ఏపిలో సినిమా టికెట్ల వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. సినిమా వాళ్లకే సినిమా కనబడే పరిస్థితి ఎదురైంది. సినీ పరిశ్రమలో వైసీపీకి అనుకూలమైన వాళ్లు ఉన్నారు. వ్యతిరేకించేవాళ్లు ఉన్నారు. థియేటర్ యజమానులు కొందరు ప్రభుత్వంపై కోర్టును ఆశ్రయించడంతో అధికార యంత్రాంగానికి చిర్రెత్తికొచ్చింది. ఆ పర్యవసానంతో ఏపిలో విస్తృతంగా థియేటర్ల తనిఖీలు జరుగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్ యాజమాన్యాలకు జరిమానాలు విధించడం, సీజ్ లు చేయడం జరుగుతోంది. దీంతో సినీ పరిశ్రమలో వైసీపీని అభిమానించే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రభుత్వ జీవోపై కోర్టుకు వెళితే ప్రభుత్వం వేస్తున్న దెబ్బమాత్రం సినీ పరిశ్రమ మొత్తానికి తగులుతోంది.
టికెట్ ధరలపై సినీ నటుడు నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్సా సత్యనారాయణ ఖండించారు. ప్రేక్షకులను తామెందుకు అవమానిస్తామని ప్రశ్నించారు. సినిమా సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. అందుకే సినిమా టికెట్ల ధరలు తగ్గించామన్నారు. వాళ్ల ఇబ్బందులు ఏమైనా ఉంటే అధికారులకు చెప్పుకుంటే ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. మార్కెట్ లో ప్రతి వస్తువుకూ ఎంఆర్పీ ధర ఉంటుంది కదా అని అన్నారు. టికెట్ ధరలను నియంత్రిస్తే అవమానించడం ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదని అన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే అధికారులను సంప్రదించాలని మంత్రి బొత్స సూచించారు. ఏపిలో సినిమా టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించారనీ, థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా షాపు కొట్ల కలెక్షన్ ఎక్కువగా ఉన్నాయని నాని చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్సా పై విధంగా కౌంటర్ ఇచ్చారు. మరో పక్క సినీ నిర్మాత శోభు వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ టికెట్ రేట్లు నిర్ణయించేది ప్రొడ్యూసర్, ప్రభుత్వం కాదంటూ నిర్మాత శోభు ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి నాని ఘాటుగా సమాధానం ఇచ్చారు. మీకు మీరే రేట్లు నిర్ణయించకుంటే ప్రభుత్వం. ప్రభుత్వం చెక్కభజన చేసుకోవాలా అని మంత్రి నాని ప్రశ్నించారు. రేట్లు పెంచి ప్రేక్షకులను దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఊరుకోదని నాని అన్నారు. ఇక సినీనటుడు నాని వ్యాఖ్యలను నిర్మాత నట్టికుమార్ తప్పుబట్టారు.
ఏపిలో సినిమా టికెట్ ధరలు, కలెక్షన్లు, షేర్స్ గురించి సరైన అవగాహన లేకుండా హీరో నాని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నట్టికుమార్ అన్నారు. వెంటనే నాని ఏపి ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టికెట్ల విషయంలో సినిమా పెద్దలందరూ కలిసి మాట్లాడుతున్న సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బీ,సీ సెంటర్ లలో టికెట్ రేట్ల వల్ల పుష్ప, అఖండ సినిమాలకు ఇబ్బంది వచ్చిందన్నారు. ఈ సమయంలో ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించారని ప్రశ్నించారు. ఇప్పుడు ఉన్న రేట్లతో నాని సినిమాలకు వచ్చే నష్టం ఏమీలేదన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న వాళ్లలో 11 మంది హీరోల సినిమా టికెట్లు కొత్త రేట్లకు విక్రయిస్తే సమస్య వస్తుందన్నారు. ఈ విషయంపై మంత్రి మాట్లాడతానని అన్నారన్నారు. 230 మంది థియేటర్ల యజమానలు కోర్టుకు వెళితే మిగిలిన అన్ని థియేటర్ లలో సోదాలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకూ ఏపిలో 70 థియేటర్లను సీజ్ చేశారన్నారు. ఈ సమస్యతోనే సతమతమవుతుంటే ఇలా మాట్లాడటం అవసరమా అని ప్రశ్నించారు. నాని వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తదుపరి కార్యాచరణ మొదలు పెడితే ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమాలకు భారీ నష్టం వస్తుందన్నారు నట్టికుమార్. జనవరి 4వ తేదీ నాటికి అన్ని సమస్యలు సద్దుమణుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదాల నేపథ్యంలో ఏపిలో తక్కువ ధరలకు సినిమా టికెట్ లు లభిస్తుండటంతో ప్రేక్షకులు మాత్రం హాపీగా ఉన్నారు.