అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బదన్నపల్లిలో దారుణ హత్యకు గురైన స్నేహలత కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. ప్రతిపక్ష పార్టీలు నోరు ఎత్తే అవకాశం లేకుండా ప్రభుత్వమే ముందుగా పెద్దఎత్తున ఎక్స్ గ్రేషియా, ఇతర హామీలు ఇచ్చేసింది. పది లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు అయిదు ఎకరాల స్థలం, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం మంజూరుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఈ ఘటన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తక్షణం స్పందించి ఆమె కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్గ్రేషయా ప్రకటించారు. దళిత వర్గానికి చెందిన మహిళలపై అత్యాచార ఘటనల్లో చట్టపరంగా రూ.8.25 లక్షల పరిహారం అందజేస్తారు. దీనికి సీఎం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అదనమని ఆర్ అండ్ బి మంత్రి మాలగుంట్ల శంకర నారాయణ, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.
చట్టప్రకారం అందించే 8.25 లక్షల్లో తక్షణ సాయంగా రూ.4,12,500లు అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అదే విధంగా స్నేహలత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం, ఇంటి స్థలం, అయిదు ఎకరాల పొలం ప్రభుత్వం అందజేయనున్నది. అంతే కాకుండా స్నేహలత కుటుంబానికి మూడు నెలలకు సరిపడా వంద కేజీల బియ్యం, పది లీటర్ల వంట నూనే, పది కిలోల పంచదార, ఇతర నిత్యావసర వస్తువులు, వంట పాత్రలు కూడా అధికారులు అందజేస్తున్నారు.
మూడు రోజుల క్రితం స్నేహలతను ఆమెను ప్రేమించిన యువకుడు మరో యువకుడితో కలిసి దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.