ఏపి సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్ రాత్రి కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఆయనతో చర్చించి, వినతి పత్రాన్ని అందించారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతోనూ భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. కానీ ప్రధాని మోడీని కలవకుండానే ఈ ఉదయం 9.30 గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యేందుకు సిద్దమైయ్యారు.
సీఎం జగన్ విజయవాడ బయలుదేరుతున్న సమయంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అపాయింట్మెంట్ ఖరారు అయినట్లు సమాచారం రావడంతో తన ప్రోగ్రామ్ ను మార్చుకున్న జగన్ .. నిర్మల సీతారామన్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు మంత్రితో సమావేశమై.. ఏపికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించినట్లు తెలుస్తొంది. ఆర్ధిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ, పోలవరం నిధుల విడుదలపై కూడా భేటీలో చర్చించినట్లు సమాచారం. ఇదే క్రమంలో నేడు శ్రీరామనవమి పండుగ కావడంతో మంత్రి నిర్మలా సీతారామన్ కు పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన జగన్ అనంతరం విజయవాడ బయలుదేరారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి.