AP CM Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు, రేపు వరద ప్రభావిత జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అపార నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. వరద ప్రభావంతో మూడు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో సహాయక చర్యలు ఆరా తీయడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాజెక్టులను సీఎం జగన్ స్వయంగా పరశీలించనున్నారు.
AP CM Jagan: గురువారం (నేడు) పర్యటన ఇలా..
ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి కడప జిల్లా బయలుదేరి వెళతారు. 10.30 గంటలకు కడప జిల్లా మందపల్లి చేరుకుంటారు. అక్కడ నుండి సీఎం జగన్ పుల్లపొత్తూరు గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో పర్యటించి వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి సహాయ శిబిరంలో బాధితులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 12 గంటలకు పుల్లపొత్తూరు గ్రామ సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ నుండి ఎగుమండపల్లి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కాలినడకన పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం వరదలకు దెబ్బతిన్న అన్నమయ్య డ్యామ్ ను పరిశీలించనున్నారు. ఈ సందర్భంలో వరద ప్రభావం ఫలితంగా ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై సీఎం జగన్ కు అధికారులు వివరాలు అందజేయనున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు మండపల్లి చేరుకుని వరద నష్టం, అనంతర సహాయ చర్యలపై జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.05 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ రేణిగుంట మండలం వేదలచెరువు, ఎస్టీ (యానాది) కాలనీకి చేరుకుని కాలనీ వాసులతో ముఖాముఖి, సమీక్ష నిర్వహించనున్నారు. 4.40 గంటలకు ఏర్పేడు మండలం పాపనాయుడు పేట గ్రామానికి చేరుకుని వరద నష్టాన్ని పరిశీలిస్తారు. అక్కడ నుండి తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు, పాడిపేట క్రాస్ రోడ్డు వద్ద వరద నష్టంపై బాధితులతో మాట్లాడనున్నారు. తదుపరి పద్మావతి అతిధి గృహానికి చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 5 గంటలకు వరద నష్టం, సహాయ పునరావాసంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి పద్మావతి అతిధి గృహంలో సీఎం జగన్ బసచేయనున్నారు.
శుక్రవారం పర్యటన ఇలా..
తిరుపతి కృష్ణానగర్, ఆటోనగర్ లో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు నెల్లూరు జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు. నెల్లూరు రూరల్, కోవూరు నియోజకవర్గంలో పర్యటించి వరద సహాయ చర్యలను సమీక్షించి బాధితులను పరామర్శించనున్నారు. తరువాత పెన్నా నదీ వరద ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను, వ్యవసాయ పంటలను సీఎం జగన్ పరిశీలించనున్నారు. 1.15 గంటలకు నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో బాధిత కుటుంబాల పరామర్శ. అనంతరం అధికారులతో సమీక్ష చేయనున్నారు. తరువాత 3.20 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 4.20 గంటలకు రేణిగుంట నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లికు చేరుకోనున్నారు.