CM Jagan: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపి జేఏసీ, ఏపి జేఏసీ అమరావతి సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన రెండు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం దిగివచ్చినట్లు కనబడుతోంది. ఉద్యోగుల పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ ను తిరుపతి సరస్వతీ నగర్ లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు కలిసి పీఆర్సీపై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంలో వారికి సీఎం జగన్ తీపి కబురు చెప్పారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందనీ, పది రోజుల్లో ప్రకటన చేస్తామని తెలిపారు. సీఎం జగన్ నేరుగా పది రోజుల్లో ప్రకటన చేస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాల నేతలకు ఒక భరోసా లభించింది.
మరో పక్క ప్రభుత్వం..ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. తమ డిమాండ్ ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేతలతో మాట్లాడాలని నిర్ణయించింది. ఈ రోజు మధ్యాహ్నం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హజరుకావాలని అన్ని ఉద్యోగ సంఘాలకు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ సమాచారం పంపారు. ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం నాడే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మను కలిసి పోరుబాటపై నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన రెండు రోజుల వ్యవధిలోనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడంతో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. దీనికి తోడు వైఎస్ జగన్ స్వయంగా పీఆర్సీ గురించి ప్రకటన చేయడంతో వీరిలో ఆశలు చిగురిస్తున్నాయి. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏ లతో సహా సుమారు 45 డిమాండ్లను ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టిలో పెట్టారు.