ఆర్బీకేల్లో ఉన్న పశు సంవర్ధక శాఖ విభాగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశిస్తూ గ్రామస్థాయిలో ఒకరిద్దరు వాలంటీర్లను ఈ సేవల్లో నిమగ్నం చేయాలని అందుకోసం ఎస్ఓపీ తయారు చేయాలన్నారు. పశు సంవర్ధక శాఖ, పాడిపరిశ్రమ, మత్స్యశాఖపై తాడేపల్లి లోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో ఈ శాఖలపై తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిపై అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు.
వైద్య ఆరోగ్య శాఖలో మండలానికి రెండు పీహెచ్ సీలు, అలాగే ప్రతి సచివాలయానికి ఒక విలేజ్ క్లినిక్ తరహా విధానాన్ని అమలు చేస్తున్నామనీ, అలాగే పశు సంవర్ధక శాఖలో కూడా ఈ తరహా లోనే పటిష్టమైన అంచెల విధానాన్ని తీసుకురావాలన్నారు. యూనిఫార్మిటీ (ఏకరూపత) తీసుకురావడం ద్వారా మంచి సేవలు అందుబాటులో తీసుకురావచ్చని తెలిపారు. ఈ విధానాన్ని నిర్దేశించుకున్న తర్వాత నాడు – నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. దీని కోసం ఒక మార్గదర్శక ప్రణాళిక తయారు చేయాలన్నారు. పశుసంవర్ఖక శాఖ అసిస్టెంట్ల సమర్ధత పెంచాలన్నారు.
ప్రతి మండల స్థాయిలో ఉన్న వ్యవస్థ నుండి ఆర్బీకేల్లో ఉన్న పశుసంవర్థక అసిస్టెంట్ కు పూర్తి స్థాయి మద్దతు, సహకారం ఉండాలన్నారు. ఏపిలో పశువులకు వైద్య సేవలు అందిస్తున్న అంబులెన్స్ విధానంపై ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపాయని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రానికి పంజాబ్, చత్తీస్ గడ్, కేరళ కు చెందిన అధికారులు వచ్చి సందర్శించి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు 4,765 ఏహెచ్ ఎ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఇదే సందర్భంలో జగనన్న పాల వెల్లువ, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, ఆక్వా రంగంపై సీఎం జగన్ సమీక్ష జరిపారు.
తొలుత వైయస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ మరింత విస్తృత పరిచేందుకు గానూ కొత్తగా మరో 165 అంబులెన్స్ లను క్యాంపు కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అంబులెన్స్ లలో పరికరాలను, పనితీరును పరిశీలించారు సీఎం జగన్. ఈ కార్యక్రమాల్లో మంత్రి సీదిరి అప్పలరాజు, ఏపి అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, స్పెషల్ సీఎస్ (ఎఫ్ఏసి) వై మధుసూధన్ రెడ్డి, మత్స్య శాఖ కమిషనర్ కె కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.