AP CM Jagan: ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ కేంద్రంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కాదు. కానీ రాజ్యసభలో అవసరమైన ప్రతి సారి కేంద్రంలోని బీజేపీకి వైసీపీ మద్దతు ఇస్తూనే ఉంది. రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ మధ్య అప్పుడప్పుడు మాటల యుద్ధం కొనసాగుతున్నా సీఎం వైఎస్ జగన్ మాత్రం కేంద్రంలోని ప్రధాన మంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో మంచి సన్నిహిత సంబంధాలనే కొనసాగిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో వైఎస్ జగన్మోహనరెడ్డి ఏ విషయంలోనూ నేరుగా కేంద్రాన్ని విమర్శించిన లేక నిందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే…గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా అపార నష్టం వాటిల్లింది.
AP CM Jagan: కేంద్ర బృందం పంపాలని కోరుతూ 24వ తేదీ లేఖ
ప్రధానంగా కడప, చిత్తూరు, అనంతపురం నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రహదారులు దెబ్బతిన్నాయి. కాలనీలకు కాలనీలు, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు చోట్ల రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్ర సాయం కోరుతూ ఈ నెల 24వ తేదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయాలని, పంట నష్టం అంచనాకు కేంద్ర బృందం పంపించాలని కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వేరువేరుగా లేఖలు రాశారు.
24 గంటల్లో స్పందన..
ఏపి సీఎం వైఎస్ జగన్ లేఖలు రాసిన 24 గంటల్లోపే ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఏపిలో పంట నష్టం అంచనాకు కేంద్ర బృంధాన్ని పంపింది. చూస్తున్నారు కదా కేంద్రం ఎంత ఫాస్ట్ గా స్పందించిందో. కేంద్ర బృందం మూడు రోజుల పాటు ఏపిలోని వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నది. ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఈ నెల 26 నుండి 28వ తేదీ వరకూ పర్యటించనున్నది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో రెండు బృందాలుగా రాష్ట్రంలో పర్యటించనున్నాయని విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. మొదటి రోజు శుక్రవారం కేంద్ర బృందం చిత్తూరులో పర్యటించి వరద నష్టాన్ని అంచన వేయనుంది. అలాగే శనివారం చిత్తూరు జిల్లాలో ఒక బృందం, కడపలో మరొక బృందం పర్యటించనున్నది. ఆదివారం నెల్లూరులో రెండు బృందాలు పర్యటిస్తాయి. మూడు రోజుల పాటు పర్యటన పూర్తి అయిన తరువాత కేంద్ర కమిటీ బృందం ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమావేశం కానున్నారు.