AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆశక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులకు సిద్ధం అవుతున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీకి, 2019 ఎన్నికల్లో వైసీపీకి కాపు కాసిన కాపు సామాజిక వర్గం 2024 ఎన్నికల్లో ఏ స్టాండ్ తీసుకోబోతున్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రాబోయే ఎన్నికల నాటికి టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకుంటాయని ఊహాగానాలు షికారు చేస్తున్న తరుణంలో ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో హైదరాబాద్ లో వివిధ పార్టీల్లోని కాపు సామాజిక వర్గ ముఖ్య నేతలు భేటీ కావడం, ఆ తరువాత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో బీసీ, దళిత, కాపు నేతలతో సమావేశం నిర్వహించడం జరిగాయి.
AP CM Jagan: ముద్రగడ ఆధ్వర్యంలో మరో రాజకీయ పార్టీ
ముద్రగడ ఆధ్వర్యంలో దళిత , బీసీ వర్గాలను కలుపుకుని మరో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు బలం చేకూరేలా ముద్రగడ ఈ వర్గాలు రాజ్యాధికారం కోసం ఐక్యం కావాలంటూ బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. ఇదే క్రమంలో విజయవాడలో వంగవీటి రాధ ఏపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాధాను పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ స్కెచ్ వేసిందని అనుకున్నారు. అయితే రాధ నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లి మాట్లాడటంతో రాధ పార్టీ మార్పు అంశం అంతా పుకారే అని తేలిపోయింది.
చిరంజీవికి జగన్ రాజ్యసభ ఆఫర్
తాజాగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి నిన్న పర్సనల్ గా బేటీ కావడంతో చిరంజీవికి జగన్ రాజ్యసభ ఆఫర్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలను చర్చించాలంటే సీఎం జగన్మోహనరెడ్డి చిరంజీవితో సహా ఇతర సినీ పెద్దలను ఆహ్వానించే వారు. కానీ చిరంజీవి ఒక్కరినే రావాలని ఆహ్వానించారుట. దీంతో రాజకీయ కోణం దాగి ఉందని అందరూ అనుమానిస్తున్నారు. సోదరుడు పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ పార్టీ అధినేతగా జగన్మోహనరెడ్డి సర్కార్ విధానాలను విమర్శిస్తుంటే చిరంజీవి మాత్రం అవసరం ఉన్నా లేకున్నా జగన్ నిర్ణయాలను ప్రశంసిస్తూ ట్వీట్ లు చేస్తూ వస్తున్నారు.
సినీమా టికెట్ల అంశం ఆ కమిటీ చూస్తుండగానే
మొదటి నుండి జగన్ కు చిరంజీవి అనుకూలంగా వ్యవహరిస్తున్నందున రాష్ట్రంలో కాపు సామాజికవర్గం జనసేన వైపు వెళ్లకుండా జగన్ చిరంజీవిని ఉపయోగించుకోవాలని భావిస్తున్నారనీ, ఆ క్రమంలోనే రాజ్యసభ సీటు ఆఫర్ చేసి ఉండవచ్చని అంటున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు మాత్రమే చర్చించామనీ, సినీ పరిశ్రమ బిడ్డగానే వచ్చానని మెగాస్టార్ చెప్పినప్పటికీ లోగుట్టు ఉందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధికారికంగా ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఇప్పటికే రెండు మీటింగ్ లు నిర్వహించింది. సినీమా టికెట్ల అంశం ఆ కమిటీ చూస్తుండగా ప్రత్యేకంగా చిరంజీవితో మాత్రమే సీఎం జగన్ భేటీ కావడంతో ఈ ఊహాగానాలు వస్తున్నాయి,. ఈ విషయాలపై చిరంజీవే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.