AP CM Jagan: రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంక్షేమ పథకాల అమలు విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. కరోనా సమయంలో కూడా విద్యార్ధుల చదువులకు ఇబ్బంది లేకుండా ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ ను చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఈ ఏడాది మూడవ విడత కింద 11.03 లక్షల మంది విద్యార్ధులకు జగనన్న విద్యాదీవెన కింద రూ.686 కోట్లు విడుదల చేశారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు.
Read More: AP High court: ఏపి సర్కార్కు హైకోర్టులో ఊరట..! పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం..!!
AP CM Jagan: అర్హులైన ప్రతి పేద విద్యార్ధికి ఫీజు రీయింబర్స్ మెంట్
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 19న మొదటి విడత, జూలై 29న రెండో విడత జగనన్న విద్యా దీవెన నిధులను నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. పేదరికం చదువుకు అవరోధం కారాదని అన్నారు. ఉన్నత చదువులు అభ్యసిస్తేనే వారి తల రాతలు మారతాయన్నారు. పెద్ద చదువులు చదవడానికి, పెద్ద స్థాయికి ఎదగడానికి పేదరికం అడ్డుకాకూడదన్నారు. అరకొరగా కాకుండా అర్హులైన ప్రతి పేద విద్యార్ధికి మంచి చేస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తున్నామన్నారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తింపజేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.
మన లక్ష్యం నూరు శాతం అక్షరాస్యత మాత్రమే కాదనీ, నూరు శాతం పిల్లలను గ్రాడ్యుయేట్లుగా నిలబెట్టడం కూడా అని అన్నారు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను వేరే అవసరాలకు మళ్లించకుండా పిల్లల కాలేజీలకు తప్పకుండా కట్టాలని సూచించారు. లేకుంటే నేరుగా కాలేజీలకు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం వల్ల ఉన్నత విద్య కోసం కళాశాలల్లో చేరే విద్యార్ధుల సంఖ్య పెరిగిందన్నారు.