AP CM Jagan: కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది.. ఈ మహమ్మారి బారిన పడి దేశంలో రోజుకు 4,000 మందికి పైగా మరణిస్తున్నారు.. మరోవైపు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా కూడా రోజుకి ఎంతో మంది చనిపోతున్నారు.. తాజాగా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు..
భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొవిడ్ నివారణ, వ్యాక్సినేషన్ పై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోజువారి ఆక్సిజన్ వినియోగం 600 టన్నులు పైగానే ఉంది. 300 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రం లో రోగుల అవసరాలను తీర్చేలా ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించాలని అధికారులకు సూచించారు. ప్రతిపాదిత కృష్ణపట్నం, కడప స్టీల్ ప్లాంట్ కు ఉపయోగపడాలి. అందుకోసం కృష్ణపట్నం, కడపలో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని జగన్ అన్నారు.
45 సంవత్సరాలు దాటిన వారందరికీ వాక్సినేషన్ పూర్తిచేయాలని, మొదటి డోస్ పూర్తి అయిన వారికి వ్యాక్సినేషన్ ప్రాధాన్యం ఇవ్వాలని, రెండో డోస్ ఇచ్చిన తర్వాతే మిగిలిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని వై ఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.. ఏప్రిల్ 20 నాటికి రాష్ట్రానికి 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయింపు ఉండగా.. ప్రస్తుతం 600 మెట్రిక్ టన్నుల వినియోగం కు చేరిందని, ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల వరకు ఉన్నాయని వివరించారు. ద్రవ ఆక్సిజన్ సరఫరా వాహనాలకు 56 నుంచి 78 కి పెంచామని తెలిపారు. కోవిడ్ వాక్సినేషన్కోసం గ్లోబల్ టెండర్లను పిలిచామని అధికారులు సీఎంకు వివరించారు. వ్యాక్సిన్ సరఫరా సంస్థలు మూడువారాల్లో బిడ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.