Delhi Tour: ఏపిలో రాజకీయ పరిస్థితులు గత రాజకీయాలకు భిన్నంగా ఉన్నాయి. గతంలో ప్రధాన పార్టీల నేతల మధ్య రాజకీయ వైరమే ఉండేది గానీ వ్యక్తిగత వైరం ఉండేది కాదు. వివిధ కీలక అంశాలపై అఖిల పక్ష భేటీలు జరిగేవి. అసెంబ్లీలో అధికార, విపక్ష నేతల మధ్య పలు అంశాలపై వాడివేడిగా చర్చ జరిగి ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నప్పటికీ బయటకు వచ్చిన తర్వతా సరదాగా నేతలు మాట్లాడుకునే సందర్భాలు ఉండేవి. కానీ వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయ వైరం ఎన్నికల వరకే పరిమితం కాకుండా ఆ పార్టీ నేతల మధ్య వ్యక్తిగత వైరంగా మారింది. అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు జరిగిన నేపథ్యంలో నేతలు పరస్పరం మాట్లాడుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ తరుణంలో ఏపి అధికార పక్ష నేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఢిల్లీలో ఇవేళ ఒకే వేదిక పంచుకోనుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే సమావేశానికి ఇద్దరు హజరుకానున్నారు.
ప్రపంచంలో ఆర్ధికంగా బలంగా ఉన్న గ్రూప్ ఆఫ్ ట్వంటీ (టీ 20) దేశాలకు 2022 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2023 నవంబర్ 30 వరకూ భారత్ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి వివిధ నగరాల్లో 200లకు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. భారతదేశం నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశాలను విజయవంతం చేయడం ద్వారా దేశ సత్తా ను ప్రపంచానికి తెలియజేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసేందుకు కేంద్రం అఖిలపక్షం సమావేశం నిర్వహిస్తున్నది. ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన ఈ రోజు (డిసెంబర్ 5) సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్ నందు జరిగే అభిలపక్ష సమావేశానికి హజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.
ఈ క్రమంలోనే ఏపి సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆహ్వానాలు అందడంతో వీరు సమావేశంలో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్దమైయ్యారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుుక టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే హైదరాబాద్ లోని తన నివాసం నుండి బయలుదేరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడకు చేరుకుంటారు. సాయంత్రం 4.45 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుని.. రాత్రి 7 గంటల వరకు అక్కడ జరిగే సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుండి బయలుదేరి మధ్యాహ్నం 3.15 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుండి రాష్ట్రపతి భవనంలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అయితే ఏపి ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత ఒకే వేదిక పంచుకోనుండటంతో ఆసక్తి నెలకొంది.