ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అమరావతి కేంద్రంగా ఓ భారీ కార్యక్రమానికి త్వరలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా ఉన్న తరణంలో సీఎం జగన్ అమరావతిలో పర్యటన ఆశక్తికరంగా మారుతోంది. మరో ఏడాదిలో ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ జగన్మోహనరెడ్డి ఇటీవల తన మకాంను విశాఖ కు షిప్ట్ చేయబోతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ నెలలో విశాఖ నుండి పరిపాలన చేయనున్నట్లు ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించారు. ఈ తరుణంలో అమరావతిలో ఓ భారీ కార్యక్రమానికి మూహార్తం ఫిక్స్ చేశారు. అమరావతి కేంద్రంగా జరిగే ఈ బహిరంగ సభలో జగన్మోహనరెడ్డి తన ప్రణాళికలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. అమరావతికి తాను వ్యతిరేకం అంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం జగన్ స్పందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అమరావతి ఆర్ – 5 జోన్ లో ఇళ్ల పట్టాల పంపిణీకి ఇటు హైకోర్టు, అటు సుప్రీం కోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇళ్ల పట్టాల పంపిణీకి మూహూర్తం ఖరారు చేసింది ప్రభుత్వం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50 వేల మంది పేద కుటుంబాలకు అమరావతి రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ ఈ నెల 26వ తేదీన అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ కు సంబందించి ఏర్పాట్లను సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం పరిశీలించారు.
వెంకటాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా సుమారు 20 ఎకరాల ఖాళీ ప్రదేశాన్ని బహిరంగ సభకు పరిశీలించారు. ఈ సభా వేదికగా సీఎం జగన్ అమరావతిలో పేదలకు ఇంటి పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి గురువారం సీఎం జగన్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పట్టణాబివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతి రైతులు ఇక్కడ ఇళ్ల పట్టాల పంపిణీని వ్యతిరేకిస్తున్న తరుణంలో జరుగుతున్న ఈ భారీ కార్యక్రమంలో సీఎం జగన్ చేసే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తినెలకొంది.