కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు వీరి మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్రాని రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు అంశం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, దిశ బిల్లు, రాష్ట్ర విభజన చట్టంలోని పలు అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. అదే విధంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను కూడా వివరించినట్లు సమాచారం.
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో బాగంగా బుధవారం ఉదయం పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం అయ్యే అవకాశం ఉంది. సీఎం జగన్ వెంట వైసీపీ ఎంపిలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, అదనపు ఏజీ జాస్తి నాగభూషణ్ తదితరులు ఉన్నారు. ఏపిలో ఇటీవల నేతల ఆందోళనలు. అరెస్టుల నేపథ్యంలో ప్రభుత్వంపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ నేతల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేసినట్లు కూడా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు తెలిపారు. ఈ తరుణంలో సీఎం జగన్మోహనరెడ్డి..అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.