ఏపి నూతన గవర్నర్ గా నియమితులైన రిటైర్డ్ సూప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ రేపు (శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవేళ రాజ్ భవన్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు వేరువేరుగా జస్టిస్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా సీఎం వైఎస్ జగన్, భారతి దంపతులు గవర్నర్ దంపతులను కలిశారు.
ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సీఎం జగన్, సీఎం జగన్ కు గవర్నర్ జ్ఞాపికలను అందజేసి సత్కరించుకున్నారు. సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనతో వచ్చిన టీడీపీ నేతలను గవర్నర్ కు పరిచయం చేశారు. అనంతరం కొద్దిసేపు ఆయనతో ఏకాంతంగా మాట్లాడారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తొంది. చంద్రబాబు వెంట యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చిన రాజప్ప, ఏలూరి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ తదితరులు ఉన్నారు.
కాగా రేపు గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిన్న రాష్ట్రానికి విచ్చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు.