AP CM YS Jagan: రాష్ట్రంలో కోవిడ్ విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం షెడ్యుల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడంతో విపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు ఎందుకు నిర్వహించాల్సి వస్తుందన్న విషయంపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో సారి క్లారిటీ ఇచ్చారు.
జగనన్న వసతి దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ నేడు రూ.1,048.94 కోట్లను విడుదల చేశారు. 10,89,302 మంది విద్యార్థుల తల్లులకు తొలి విడత నగదును విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని వివరించారు. ఇదే సందర్భంలో విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది పరీక్షల విషయంలో విమర్శలు చేయడాన్ని ప్రస్తావిస్తూ..పరీక్షల విషయంలో విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసం తాను ఆలోచిస్తున్నానన్నారు. పరీక్షల విషయాన్ని రాష్ట్రాలకే కేంద్రం వదిలివేసిన విషయాన్ని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థుల మార్కులను బట్టే కాలేజీలో సీటు వస్తుందని అన్నారు. పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేయడం సులభమే కానీ విద్యార్థులకే అది నష్టమని అన్నారు. పరీక్షలు నిర్వహించకుండా పాస్ సర్టిఫికెట్లు ఇస్తే భవిష్యత్తులో విద్యార్థులు నష్టపోతారన్నారు., టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటామని జగన్ పేర్కొన్నారు. కోవిడ్ పై పోరాటంలో కశ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
జగనన్న వసతి దీవెన ద్వారా విద్యారంగంలో డ్రాప్ అవుట్స్ తగ్గాయని జగన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుండి సీబీఎస్ఈ సిలబస్ ను తీసుకువస్తున్నామని అన్నారు. వచ్చే ఏడాది నుండి అమ్మఒడి పథకానికి ఆప్షన్స్ ఇచ్చామనీ, వారికి డబ్బు లేదా ల్యాప్ టాప్ లు ఇస్తామని జగన్ వెల్లడించారు. నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల రూపు రేఖలు మారాయని ఈ సందర్భంగా గుర్తు జగన్ చేసారు.