ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అతి పెద్దదైన గుంకలాం లేఅవుట్లో వైఎస్ఆర్ జగనన్న కాలనీ శంకుస్థాపన పైలాన్ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన జగన్ మాట్లాడుతూ గుంకలాం లేఅవుట్లో 12,301 మంది లబ్దిదారులకు ఇళ్లపట్టాలు ఇస్తున్నామన్నారు. ఈ కాలనీలో ఆసుపత్రి, పసువుల ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, ఆడిటోరియం, పాఠశాలలు, హైస్కూళ్లు, బస్టాండ్ లు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, అంగన్ వాడీ కేంద్రాలు, ఇలా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇది ఒక చిన్న నగర పంచాయతీ గా అభివృద్ధి చెందుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 95 శాతం హామీలను నేరవేర్చామని జగన్ అన్నారు. ప్రతి గ్రామంలో, పట్టణంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోందనీ, పేదలకు 2.20లక్షల టిడ్కో ఇళ్లను కట్టిస్తున్నామన్నారు. 35.70 లక్షల ఇళ్లను రెండు దశల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకు మంచి పనులు చేస్తుంటే ప్రతిపక్షం ప్రతి దానిలో కోర్టులకు వెళ్లి అడ్డంకులు సృష్టిస్తోందని జగన్ విమర్శించారు. చంద్రబాబు అనుచరుల పిటిషన్ ల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పది శాతం ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయిందనీ, న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కాగానే మిగిలిన వారందికీ ఇళ్లపట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్సా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపి ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం నియోజకవర్గంలోని గుంకలాం వద్ద 12,301 మంది లబ్దిదారుల కోసం 397.36 ఎకరాల్లో భారీ లే అవుట్ వేశారు. ఇక్కడ ప్రభుత్వం రూ.4.37 కోట్లతో లే అవుట్ అభివృద్ధి చేసింది. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గానూ ప్రభుత్వం రూ.101.73 కోట్లు ఖర్చు చేసి 428 మంది రైతుల నుండి భూమిని కొనుగోలు చేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?