ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపి సీఎం వైఎస్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం మోడీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంలో ఏపి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో భారీ ఎత్తున పంపిణీ చేస్తున్న ఇళ్ల పట్టాల విషయాన్ని వివరించారు. ఏపిలో 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామనీ, ఇందు కోసం 68,677 ఎకరాల భూమిని సేకరించామని తెలిపారు. 16,098 ఈడబ్ల్యుఎస్ కాలనీలను అభివృద్ధి చేస్తున్నామనీ, 2022 లోపు ఇళ్లు పూర్తి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. మహిళా సాదికారికతకు పెద్ద పీట వేసేలా మహిళా లబ్దిదారుల పేరుతో ఇళ్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు జగన్ తెలిపారు. నిర్మాణం చేస్తున్న కాలనీల్లో నీరు, విద్యుత్, తదితర అన్ని మౌలిక సదుపాయలు కల్పిస్తున్నామనీ చెప్పిన జగన్ పీఎంఏవై అర్బన్ కింద ఏపికి 20.21 లక్షల ఇళ్లు కేటాయించారని అన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని జగన్ వివరించారు.