ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి జన్ పథ్ 1లోని తన అధికార నివాసానికి చేరుకుని బస చేశారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రధాన మంత్రి మోడీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల మేరకు నిధులు విడుదల, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, విభజన చట్టంలోని పెండిండ్ అంశాలు తదితర విషయాల గురించి చర్చించనున్నారని సమాచారం.
ఇదే క్రమంలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి అందిస్తున్న రేషన్ పంపిణీలో హేతుబద్దత లేదనీ, దీని వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని కావున దీన్ని సవరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీని కోరనున్నారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటైన విద్య కళాశాలలకు తగిన ఆర్ధిక సహాయం, భోగాపురం ఎయిర్ పోర్టు నకు సంబంధించి క్లీయరెన్స్ లు, ఏపీఎండీసీ కి ఇనుప గనుల కేటాయింపునకు సంబంధించిన విషయాలను కూడా సీఎం జగన్ కోరనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అదే విధంగా ఇటీవల గోదావరి వరదలు, భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఏలూరు జిల్లాలో వేలాది ఎకరాలు ముంపునకు గురి అయ్యాయి. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇప్పటికే కేంద్ర బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి వరద నష్టంకు సంబంధించి అంచనాలు సేకరించింది. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్ త్వరలో పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. వరద నష్టం పరిహారంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ చర్చించనున్నారని సమాచారం.
అమలుకాని కేసిఆర్ హామీలను ఎత్తి చూపి మరీ తూర్పారబట్టిన అమిత్ షా
మోడీతో సమావేశం పూర్తి అయిన తర్వాత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి ధన్ ఖర్ లను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయనున్నారు. తదుపరి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ సమస్యలపై చర్చించనున్నారని సమాచారం. అవసరం అయితే ఈ రాత్రికి కూడా ఢిల్లీలోనే బస చేసి రేపు (మంగళవారం) కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు తెలుస్తొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హజరైన సందర్భంలో ప్రధాని మోడీతో చాలా సేపు మాట్లాడారు. ఈ నెలలోనే రెండవ సారి ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.