మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి బిజీబిజీగా గడిపారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్ .. ముందుగా కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. నాడు – నేడు పథకం ద్వారా విద్య, ఆరోగ్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ గా భావించి ప్రత్యేక సాయం వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రగతి – అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై నివేదిక ను సమర్పిస్తూ పలు కీలక సూచనలు చేశారు.
అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సీఎం జగన్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం నిధులు సహా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. ఆదివారం నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు వీలైనంత త్వరగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపేలా చూడాలని కోరారు.
ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేసారు సీఎం జగన్. ఢిల్లీలోని ఏపీ భవన్ సహా షెడ్యుల్ 9,10 ఆస్తుల విభజనపై అమిత్ షాతో సీఎం జగన్ చర్చించారు. తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువస్తూ ఏపి విద్యుత్ సంస్థల ఆర్ధిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుని వెంటనే బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుండి విజయవాడకు ప్రత్యేక విమానంలో రానున్నారు సీఎం జగన్.
New Parliament Building Inauguration: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ