AP CM YS jagan: ఏపిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రోడ్లు కోతలకు గురైయ్యారు. వంతెనలు కూలిపోతున్నాయి. భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించింది. పంట పొలాలు మునిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాల్లో అంధకారం తాండవిస్తోంది. బాధితులు కట్టు బట్టలతో మిగిలారు. ఇళ్లలోని వస్తువులు వరద నీటితో కలిసిపోయాయి. పలు కాలనీలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 27 మంది మృతి చెందారు, వరదల కారణంగా పలువురు గల్లంతు అయ్యారు. గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పలు చూట్ల భవనాలు కూలుతున్నాయి. నిన్న వరద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసిన ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
AP CM YS jagan: వరద సహాయక చర్యల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలి
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల నుండి ఎమ్మెల్యేలు అమరావతికి చేరుకున్నారు. ఈ నెల 26వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహనరెడ్డి వరద ప్రాంతాల ఎమ్మెల్యేలకు కీలక సూచన చేశారు. ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానక్కరలేదని చెప్పారు. వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని జగన్ వారికి పిలుపునిచ్చారు. ఇన్ చార్జి మంత్రులు, జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయక చర్యలను పర్యవేక్షించాలని కోరారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల తక్షణ సాయం అందేలా చూడాలని ఆదేశించారు. ప్రధానంగా పారిశుద్ద్య పనులు, డ్రైనేజీల పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. రేషన్ సరుకుల పంపిణీ, నష్టంపై పక్కాగా అంచనా వేయడంపై దృష్టి సారించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అండగా ఉండాలని సీఎం సూచించారు.