ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న కోనసీమ లంక గ్రామాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో బాధితులను పరామర్శించి వారికి అందిన సాయం వివరాలు తెలుసుకున్న సీఎం జగన్ రాత్రి రాజమహేంద్రవరంలో బస చేశారు. ఈ రోజు (బుధవారం) అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో నేరుగా మాట్లాడతారు.
రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు చేరుకోనున్న సీఎం జగన్ ఉదయం 9.30 గంటలకు కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశం అవుతారు. అక్కడి నుండి మధ్యాహ్నం 12 గంటలకు ఎలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయ్యగూట్ట గ్రామం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వరద బాధిత గ్రామాలకు సంబంధించి ఫోటో గ్యాలరీని పరిశీలిస్తారు. అనంతరం తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశమవుతారు. తదుపరి మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడి నుండి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.