YS Jagan : దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఉదృత మవుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీ నుండి 45 సంవత్సరాలు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా వేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని దేశ వ్యాప్తంగా ప్రజలు సద్వినియోగం చుసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. వైఎస్ జగన్ 1972 డిసెంబర్ 21న జన్మించినందున ఆయన వయసు ఇప్పుడు 48 సంవత్సరాలు. 45 సంవత్సరాల వయస్సు దాటినందున వైఎస్ జగన్ ఏప్రిల్ 1వ తేదీన గుంటూరులోని భరత్ పేట వార్డు సచివాలయంలో వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఇదే సందర్భంలో వార్డు సచివాలయాల్లో వాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఏప్రిల్ 1వతేదీన సీఎం జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో సోమవారం వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదెవి వెంకట రమణ, మేయర్ మనోహర్, ఎమ్మెల్యే మద్దాలి గిరి, జిల్లా అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకట రమణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఆర్థిక భారం పడుతున్నా వ్యాాక్సినేషన్ లో ముందున్నామని అన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏప్రిల్ 1వ తేదీ నుండి గ్రామ సచివాలయాల్లోకి అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. అదే రోజు సీఎం వైఎస్ జగన్ కూడా కరోనా టీకా వేయించుకుంటారని తెలిపారు. వ్యాక్సిన్ పై ప్రజలు ఎటువంటి అపోహలు, భయాలు, ఆందోళనలు పెట్టుకోవాల్సిన పని లేదన్నారు. ప్రభుత్వ సూచనలు, సలహాలు ప్రజలకు అందరూ పాటించాలన్నారు.
ఏపిలోనూ రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 31,325 మందికి పరీక్షలు నిర్వహించగా 997 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా కారణంగా అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడచిన 24 గంటల్లో 282 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని ఆరోగ్య వంతులు అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 6,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి.