AP CM YS Jagan: గుంటూరులో బిటెక్ యువతి దారుణ హత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరా తీశారు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం ప్రకటించారు. గుంటూరు జిల్లా కాకాణిలో జరిగిన దుర్ఘటన ఎంతో దురదృష్టకరమని, విద్యార్థిని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా జగన్ పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసి బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశిస్తున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు.
నిందితుడు అరెస్టు
కాగా బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణను అరెస్టు చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రమ్య హత్య ఘటన అత్యంత దురదృష్టకమని డీజీపీ పేర్కొన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించామన్నారు. ఈ కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారన్నారు. రమ్య హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగా గుంటూరు జిల్లా పమిడిపాడు వద్ద కనిపించిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులను చూసిన నిందితుడు శశికృష్ణ తన గొంతును కోసుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అడ్డుకుని గాయపడిన శశికృష్ణను అదుపులోకి తీసుకుని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం గుంటూరు జీజీహెచ్ క తరలించారు.