రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలంటే గుడ్డతో తయారు చేసినవే పెట్టాలని అన్నారు. విశాఖలో శుక్రవారం జరిగిన పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థతో కుదిరిన ఎంవోయూలో సీఎం జగన్ పాల్గొన్నారు. విశాఖ బీచ్ లో ప్రపంచంలోనే అతి పెద్ద క్లీనింగ్ జరిగిందన్నారు. ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు సుమారు 28 కిలో మీటర్ల పొడవునా సాగర తీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్ధాల సేకరించే కార్యక్రమాన్ని చేపట్టారనీ, ఇందులో దాదాపు 20వేల మంది వాలంటీర్లు పాల్గొని 76 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించారని చెప్పారు.
ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేదం
సముద్రాన్ని కాపాడుకుంటేనే మన పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్న జగన్.. ఏపిలో తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. పార్లే సంస్థ సముద్రం నుండి ప్లాస్టిక్ వ్యర్ధాలను తీసి రీసైక్లింగ్ చేసి ఉత్పత్తులు తయారు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేదం తొలి అడుగుగా అభివర్ణంచారు జగన్. 2027 నాటికి ఏపిని ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ గా మారుస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇదే సందర్భంలో ప్లాస్టిక్ వ్యర్ధాలతో తయారు చేసిన షూ, కళ్లజోడులను జగన్ చూపించారు. ప్లాస్టిక్ వ్యర్ధాలతో తాయరు చేసిన స్పెట్స్ పెట్టుకుని న్యూ లుక్ లో కనిపించారు సీఎం జగన్.
అనంతరం సిరిపురంలోని ఏయూ కన్వకేషన్ హాలు నందు మైక్రో సాఫ్ట్ సంస్థ అందించిన డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకున్న అయిదు వేల మంది విద్యార్ధుల్లో కొందరికి సీఎం జగన్ సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్ధి ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ కోసం ప్రభుత్వం రూ.32 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మైక్రో సాఫ్ట్ ద్వారా దేశం లో మొదటి సారిగా సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ ఇవ్వడం జరుగుతోందని సీఎం జగన్ చెప్పారు. విద్యారంగంలో అనేక కీలక మార్పులు తీసుకువచ్చామని సీఎం వివరించారు.