ఆంధ్రప్రదేశ్లో వివిధ వర్గాల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్న పథకాలను అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాల్లో ఒకటైన అమ్మఒడి పథకం కింద పిల్లలను పాఠశాలలు, కళాశాలలకు పంపే తల్లులకు ఏటా రూ.15వేలు ప్రభుత్వం అందిస్తోంది. అమ్మఒడి రెండవ విడత చెల్లింపులను సీఎం జగన్ సోమవారం నెల్లూరు జిల్లాలో ప్రారంభించారు. విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయాన్ని సీఎం జగన్ ప్రకటించారు.
అమ్మఒడి నిధులకు బదులు ల్యాప్ ట్యాప్లు..జగన్
అమ్మఒడి పథకం కింద వచ్చే ఏడాది నుండి డబ్బులకు బదులు ల్యాప్ టాప్ తీసుకునే అవకాశం కల్పిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. విద్యార్థులకు కంప్యూటర్ స్కిల్స్ పెంచేందుకు ల్యాప్ టాప్ ఆఫర్ తీసుకువచ్చారు. వచ్చే ఏడాది నుండి తొమ్మిదవ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు ఈ ఆఫర్ వర్తిస్తుందన్నారు. అమ్మఒడి డబ్బులు వద్దనుకుంటే ల్యాప్ టాప్ ఇస్తామని చెప్పారు జగన్. 4 జీబీ ర్యామ్, 500 జీవీ హార్డ్ డిస్క్, విండోస్ 10 ఒఎస్ ఫీచర్స్తో ల్యాప్ టాప్ ఉంటుందన్నారు. మూడేళ్ల వారంటీతో కూడిన ల్యాప్ టాప్ లను విద్యార్థులకు అందిస్తామని జగన్ తెలిపారు. రాబోయే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సేవలు విస్తరించడంతో పాటు అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ కేబుల్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అమ్మఒడి పథకం ద్వారా 45 లక్షల మందికి లబ్ది చేకూరిందని జగన్ తెలిపారు. ఈ 19 నెలల పాలనలో చదువుల విప్లవం తీసుకువచ్చామని అన్నారు. అమ్మఒడి రెండవ విడత ద్వారా 6,673 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేయడం వల్ల ఈ ఏడాది అదనంగా నాలుగు లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని సీఎం జగన్ తెలిపారు.
ఇది కూడా చదవండి..బ్రేకింగ్ : పంచాయతీ పోల్స్పై హైకోర్టులో ఎస్ఈసీకి ఎదురుదెబ్బ