AP CM YS Jagan: ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయాలు తీసుకోమంటుంటారు పెద్దలు. ఎందుకంటే ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు అనర్ధాలకు, ఆపోహాలకు కారణం అవుతుంటాయి. ఒక్కోసారి వాటిని సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కాకపోతే ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆవేశంతో తీసుకున్న ఓ నిర్ణయం అనర్ధానికి దారి తీయకముందే సరి దిద్దుకునే అవకాశం ఏర్పడింది. అది ఏమిటంటే ఏపి శాసనమండలి ఇష్యూ. ఏపి శాసనమండలిని రద్దు చేస్తూ గత ఏడాది జనవరిలో జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దాన్ని కొనసాగించేలా ఆనాడు మండలి రద్దుకు చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకుంది.
AP CM YS Jagan: గతంలో మండలి రద్దుకు తీర్మానం
వివరాల్లోకి వెళితే.. గతంలో అసెంబ్లీలో ఆమోదించిన మూడు రాజధానుల బిల్లునకు అప్పట్లో మండలిలో టీడీపీకి మెజార్టీ ఉండటంతో ఆమోదం లభించలేదు. అసెంబ్లీలో ఆమోదించిన ప్రతి కీలక బిల్లును మండలి లో ఆమోదం తెలుపకుండా సెలెక్ట్ కమిటీకి పంపుతుందన్న ఆవేశంతో నాడు సీఎం జగన్.. అసలు మండలినే రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించింది జగన్ సర్కార్. అయితే కేంద్రం వద్ద అప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించి శాసనమండలి రద్దు, శాసనమండలి పునరుద్దరణ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వాటి సరసన ఏపికి సంబంధించిన శాసన మండలి రద్దు బిల్లు చేరింది. వీటిపై కేంద్రం ఇంత వరకూ ఆమోదం తెలుపలేదు. ఒక వేళ కేంద్రం .. శాసన మండలిని రద్దు చేస్తే మళ్లీ పునరుద్దరణ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం ఏపి శాసన మండలిలో వైసీపీ బలం పెరిగింది. పలువురు వైసీపీ నేతలకు ఎమ్మెల్సీ అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పటికే ఏపి సర్కార్ శాసనమండలిని రద్దు చేస్తూ కేంద్రానికి సిఫార్సు చేసిన నేపథ్యంలో శాసనమండలి కొనసాగుతుందా లేదా అన్న సందిగ్దత అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు ప్రజానీకంలోనూ ఉంది.
Read More: AP High Court: కొండపల్లి మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!
మండలి రద్దు తీర్మానం ఉపసంహరణ
ఈ సందిగ్ధతను తొలగిస్తూ జగన్ సర్కార్ నేడు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. శాసనమండలిని కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ రోజు అసెంబ్లీలో శాసనమండలి రద్దు చేస్తూ గతంలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలోని 168 అధికరణ కింద 1958లో ఏపిలో శాసన మండలి ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ హయాంలో శాసనమండలిని రద్దు చేశారు. ఆ తరువాత తిరిగి 2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మండలి పునరుద్దరణ జరిగింది. గత ఏడాది జనవరి 27న రాష్ట్రానికి కౌన్సిల్ అవసరం లేదని జగన్మోహనరెడ్డి సర్కార్ తీర్మానించింది. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపి ఏడాది దాటుతున్నా ఎటువంటి నిర్ణయం వెలవడలేదు. ఇప్పుడు సర్కార్ ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్నది. సో..ఇక రాష్ట్రంలో శాసనమండలి యధావిధిగా కొనసాగుతోంది. సందిగ్దతకు జగన్ సర్కార్ తెరతీసేసింది.