AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. గత పర్యటనలకు భిన్నంగా జగన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గతంలో ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా పీఎం మోడీ, లేకపోతే ఒకరిద్దరు కేంద్ర మంత్రులను కలిసి వచ్చేవారు. అయితే ఈ సారి షెడ్యుల్ కార్యక్రమాలు ఎక్కువగానే ఉన్నాయి. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్ ముందుగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో, ఆ తరువాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. రాత్రికి 9గంటల తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేసి రేపు ఉదయం వాణిజ్య, రైల్వే, పెట్రోలియం శాఖ మంత్రులతో భేటీ కానున్నారు. రేపు మధ్యాన్నం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. కేంద్ర మంత్రుల భేటీలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలకమైన అంశాలపై చర్చించి, వాటికి సంబంధించి వినతి పత్రాలు సమర్పించినట్లు సమాచారం.
Read More: Viral video: ఈ ముసలాయన మామూలోడు కాదు..! నవ మన్మధుడే..! ఆయన ట్రాక్ రికార్డు ఆదుర్స్..!!
ఎంపి రఘురామకృష్ణం రాజును ఏపి సీఐడీ రాజద్రోహం తదితర అభియోగాలపై అరెస్టు చేయడం, తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏపి సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. అమిత్ షా వద్ద రఘురామ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ బకాయిలు, అంచనా వ్యయం పెంపు అంశం తదితర కీలక విషయాలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. సీఎం జగన్ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దదాస్, ఎంపిలు విజయసాయిరెడ్డి, బాలశౌరి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మోపిదేవి వెంకట రమణ తదితర ఎంపిలు ఉన్నారు.