AP CM YS Jagan: ఏపి పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో సీజేఐ కు ఇచ్చిన తేనీటి విందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దంపత సమేతంగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హజరైన సీజేఐ ఎన్వీ రమణ దంపతులకు సీఎం వైఎస్ జగన్, భారతి దంపతులు స్వాగతం పలికారు. ఈ సందర్భంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులను సీజేఐ ఎన్వీ రమణకు సీఎం జగన్ పరిచయం చేశారు. ఈ తేనీటి విందులో డిప్యూటి సీఎంలు, మంత్రులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, ఏపి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రెండు రాష్ట్రాల న్యాయమూర్తులు పాల్గొన్నారు.
AP CM YS Jagan: సీజేఐ ఎన్వీ రమణతో సీఎం జగన్ భేటీ
తొలుత కడప జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న సీఎం వైఎస్ జగన్ .. నోవాటెల్ హోటల్ కు వెళ్లి సీజేఐ ఎన్వీ రమణను కలిసి తేనేటి విందుకు ఆహ్వానించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామం జరగకముందు ఆయనపైనే పలు అభియోగాలు చేస్తూ నాటి సీజేఐ జస్టిస్ బొబ్డే కు సీఎం వైఎస్ జగన్ ఫిర్యాదు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే జగన్ చేసిన అభియోగాలపై సుప్రీం కోర్టు అంతర్గత విచారణ జరిపి ఆ ఆరోపణలు నిరాధారమైనవిగా భావించిన నేపథ్యంలో నాటి సీజేఐ జస్టిస్ బొబ్డే తన తరువాత సీజేఐ గా ఎన్వీ రమణను సిఫార్సు చేయడం, రాష్ట్రపతి ఆమోదంతో ఎన్వీ రమణ ఆ పదవిలో నియమితులు కావడం తెలిసిందే. అయితే జస్టిస్ వెంకట రమణ సీజేఐ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారిగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు వచ్చిన సమయంలో అటు తెలంగాణలో సీఎం కేసిఆర్ స్వాగతం పలికారు. ఏపిలో తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో సీఎం జగన్ గానీ, మంత్రులు గానీ స్వాగతం పలకలేదు. సాధారణ ప్రోటోకాల్ భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలే నాడు సీజేఐ ఎన్వీ రమణకు స్వాగతం పలికారు. ఈ సారి రాష్ట్రానికి విచ్చేసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున భారీ ఎత్తున స్వాగతం పలకడంతో పాటు తేనేటి విందు ఏర్పాటు చేసి స్వయంగా సీఎం జగన్ దంపతులు సీజేఐ దంపతులను మర్యాదపూర్వకంగా కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.