ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. నరసాపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం వైఎస్ జగన్ నరసాపురం పర్యటనకు సంబంధించి అధికారులు షెడ్యుల్ విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుండి సీఎం జగన్ హెలికాఫ్టర్ లో బయలుదేరి 10.50 గంటలకు నరసాపురం చేరుకుంటారు. ఉదయం 11.15 గంటల నుండి 12.50 వరకూ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు , శంఖుస్థాపనలు చేసి అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు బయలుదేరి 2 గంటలకు తాడేపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు.
ఈ పర్యటనలో నరసాపురం నియోజకవర్గ పరిధిలో రూ.3300 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఫిషింగ్ హార్బర్, అక్వా యూనివర్శిటీ, ఉప్పటేరు రెగ్యులేటర్ నిర్మాణం ఇలా మొత్తం 12 అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో సీఎం జగన్ తొలి సారిగా నరసాపురం నియోజకవర్గంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.
రూ.13.50 కోట్లతో రుస్తుంబాదలో వంద పడకలతో ఆధునిక వసతులతో నిర్మించిన ఆసుపత్రిని సీఎం జగన్ ప్రారంభించడంతో పాటు రూ.4.80 కోట్లతో నరసాపురంలో పునఃనిర్మించిన బస్టాండ్ ను ప్రారంభిస్తారు. అనంతరం పట్టాల పంపిణీ చేయనున్నారు. అదే విదంగా పవర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన, గోదావరి ఏటి గట్టు పటిష్టం, స్లూయిస్ పనులకు శంకుస్థాపన, పిషింగ్ హార్బర్, కార్గో పోర్టు నిర్మాణం, అక్వా యూనివర్శిటీ, 220 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ , అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు, మున్సిపల్ వాటర్ ప్రాజెక్టు, ఉప్పుటేరు పై రెగ్యులేటర్, శేషావతారం వియర్ ఛానల్ అభివృద్ధి, ప్రధాన రహదారులు ఇలా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.