AP CM YS Jagan : ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వివిధ వర్గాల సంక్షేమ కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి పిల్లలను పాఠశాలల తల్లుల బ్యాంకు అకౌంట్ లో ఏటా రూ.14వేలు జమ చేస్తున్నది జగన్ సర్కార్. ఇప్పుడు తాజాగా బాలికల కోసం మరో కీలక నిర్ణయాన్ని సీఎం జగన్మోహనరెడ్డి తీసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏడు నుండి 12 వ తరగతి వరకు విద్యార్థులకు శానిటరీ నేప్ కిన్స్ ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనిపై శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్య, వైద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాలల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని సమావేశంలో జగన్ ఆదేశించారు. మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం రోజున ఉచిత శానిటరీ నేప్ కిన్స్ పంపిణీ పథకంను ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. బ్రాండెడ్ కంపెనీకి చెందిన శానిటరీ నేప్ కిన్స్ జూలై ఒకటవ తేదీ నుండి నెలకు పది చొప్పున ఏడాదికి 120 పంపిణీ చేయనున్నది. ఇందు కోసం ప్రభుత్వం సుమారు 41.4 కోట్లు ఖర్చు చేస్తున్నది.
మరో పక్క గ్రామీణ ప్రాంతాల్లో చేయూత కిరాణా స్టోర్స్ ద్వారా తక్కువ ధరకే బ్రాండెడ్ కంపెనీలకు చెందిన శానిటరీ నేప్ కిన్స్ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. శానిటరీ నేప్ కిన్స్ తయారీలో అత్యుత్తమ కంపెనీలతో మెప్మా, సెర్ఫ్ ఎంఒయులు చేసుకోవాలన్నారు.
AP CM YS Jagan : విద్యార్థినులకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ
విద్యార్థినులకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ అందించాలని అధికారులకు జగన్ ఆదేశించారు. దీని కోసం లాప్ టాప్ లను వాడుకోవాలన్నారు. అమ్మఒడి పథకం లో లాప్ టాప్ లు కావాలనుకున్న 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే ఆప్షన్ ఇచ్చామన్నారు. ప్రభుత్వం ఇస్తున్న లాప్ టాప్ తో పాటు రెప్యూటెడ్ సంస్థలు (కోచింగ్ సెంటర్స్) సహకారం తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. విద్యార్థుల నుండి ల్యాప్ టాప్ ల ఆప్షన్ ప్రక్రియ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఉన్నత విద్య శాఖ, స్కిల్ డెవలప్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి , ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పిఆర్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.