AP CM YS Jagan: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ మంచి ఫలితాలు అందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్, ఫివర్ సర్వే నిర్వహణలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఉండటం మూలంగా ఒకే రోజు 13 లక్షల పైగా వ్యాక్సిన్లు అందించిన ఘనత ఏపి సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం కోవిడ్ పరిస్థితి, వాక్సినేషన్ అంశాలపై సమీక్ష నిర్వహించగా, సీఎం జగన్ మరో మారు వార్డు, గ్రామ సచివాలయాల గురించి మోడీకి వివరించారు.
Read More: Amaravati Land scam: అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సుప్రీం ఎమన్నదంటే..!?
కోవిడ్ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్ సహాయానికి కృతజ్ఞతలు తెలియజేసిన సీఎం వైఎస్ జగన్ .. రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నామనీ, రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు లేవని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఏపిలో లేవని పేర్కొన్నారు. అయినప్పటికీ కోవిడ్ ను ఎదుర్కొవడంలో చెప్పుకోదగిన పని తీరు కనబరిచామని వివరించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్ విస్తరణ ను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పని చేశాయన్నారు. ఇప్పటి వరకూ 12 సార్లు ఇంటింటికీ ఫీవర్ సర్వే చేశామన్నారు. లక్షణాలు ఉన్న వారిని గుర్తించి, ఫోకస్ గా పరీక్షలు చేశామన్నారు. దీని వల్ల కోవిడ్ విస్తరణను అడ్డుకోగలిగామని చెప్పారు. వ్యాక్సినేషన్ అనేది కోవిడ్ కు సరైన మార్గమనీ, దీనికి సంబంధించి కొన్ని కీలక సూచనలు చేస్తున్నామని జగన్ తెలియజేశారు.
రాష్ట్రానికి 1,68,46,210 వ్యాక్సిన్ డోసులు రాగా వాటితో 1,76,70,642 మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగిందన్నారు. వ్యాక్సినేషన్ లో మంచి విధానాల వల్ల ఇచ్చిన దాని కన్నా ఎక్కువ మందికి వేయగలిగామనీ దూబరా అరికట్టామని తెలిపారు. జూలై నెలలో 53,14,740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారన్నారు. జూలై నెలలో ప్రైవేటు ఆసుపత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించగా క్షేత్రస్థాయిలో చూస్తే వారికి కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయిన విషయాన్ని తెలియజేశారు. జూలై నెలలో ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా వ్యాక్సినేషన్ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమేనని చెప్పారు. ఆసుపత్రిలో వినియోగించకుండా ఉండిపోయిన స్టాకు కోటాను తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహాదపడుతుందని పేర్కొన్న జగన్.. కోవిడ్ నివారణలో అందించే సలహాలు, సూచనలు, మార్గదర్శకాలు పాటిస్తూ ముందుకు సాగుతామని మోడీకి తెలియజేశారు.