AP CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ రేపటి పోలవరం పర్యటన రద్దు అయ్యింది. తొలుత రేపు సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారని అధికార వర్గాలు ప్రకటించాయి. అయితే అకస్మాత్తుగా ఆయన పర్యటన వాయిదా పడింది. సీఎం పర్యటనకు పోలవరం ప్రాజెక్టు వద్ద అన్ని ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో ఒక్క రోజు ముందుగా సీఎం పర్యటన వాయిదా పడినట్లు సీఎంఒ వెల్లడించింది.
ఈ నెల 14వ తేదీన సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడం లేదని సీఎం కార్యాలయం నేడు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులకు సీఎంఒ నుండి సమాచారం అందింది. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష జరిపి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం సీఎం పర్యటన రద్దు అయిన నేపథ్యంలో తిరిగి ఎప్పుడు పోలవరం కు వెళతారు అనేది తదుపరి నిర్ణయించనున్నారు. మరో పక్క సీఎం పర్యటనకు ప్రాజెక్టు వద్ద ముమ్మర ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో చివరి నిమిషంలో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో కారణం ఏమై ఉందని ఆలోచనలో పడ్డారు.
సీఎం పర్యటన వాయిదాకు ప్రధాన కారణం ఏమిటంటే.. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపిలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పోలవరం పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు వెల్లడించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడం సురక్షితం కాదని అధికారులు తెలియజేయడం వల్లనే సీఎం జగన్ పోలవరం సందర్శన వాయిదా పడినట్లు తెలుస్తోంది. మరో పక్క సీఎం పర్యటనకు వస్తున్నారని తెలియడంతో ఇప్పటికే అదికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రయల్ రన్ పనులను సీఇ సుధాకర్ బాబు, ఎస్ఈ నర్శింహమూర్తి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ జీఎంలు సతీష్ బాబు, బెకెం ఇంజనీరింగ్ సంస్థ ప్రాజెక్టు ఇన్ చార్జి ఎ నరేంద్ర పరిశీలించారు. స్పిల్ వే బ్రిడ్జ్ పై 45 కాంక్రీట్ స్లాబులు వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 42 పూర్తి అయ్యాయి. అలాగే 49 ట్రూనియం బీమ్ లు పూర్తి అయ్యాయి. స్పిల్ వే బ్రిడ్జ్ లో 48 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ 28 గేట్ల అమరిక పూర్తి అయ్యింది. కాగా తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత వచ్చే వారంలో సీఎం జగన్ ప్రాజెక్టు సందర్శన ఉండవచ్చని భావిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?