AP CM YS Jagan: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాజీపడటం లేదు. నవరత్న పథకాల క్యాలెండర్ లో పేర్కొన్న విధంగా ఆయా వర్గాలకు కోట్లాది రూపాయల నిధులను విడుదల చేస్తూనే ఉన్నారు. తాజాగా నేడు సీఎం వైఎస్ జగన్,,జగనన్న విద్యా దీవెన రెండో విడత సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశారు. దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనన్నారు. ప్రతి అడుగులోనూ విద్యార్థుల భవిష్యత్తు గురించే ఆలోచన చేస్తున్నామనీ, ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలన్నదే తమ తాపత్రయం అన్నారు. ఇందులో భాగంగానే జగనన్న విద్యాదీవెన అనే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పిల్లల చదువు తల్లిదండ్రులకు భాగం కాకూడదని విద్యాదీవెన అమలు చేస్తామన్నారు. దేవుడి ఆశీస్సులతోనే ఇదంతా చేయగల్గుతున్నామని పేర్కొన్నారు. ప్రతి పేద విద్యార్థికీ ఉన్నత చదువులు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమనీ ఈ క్రమం లోనే అధికారంలోక వచ్చిన వెంటనే విద్యార్థుల భవిష్యత్తు కోసం వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నామని జగన్ పేర్కొన్నారు.
జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థుల కోర్సు ఫీజులకు సంబంధించి నాలుగు విడతల్లో డబ్బును జమ చేస్తున్నారు. ఏప్రిల్ 19న తొలి విడత నగదు విడుదల చేసిన సీ ఎం వై ఎస్ జగన్ నేడు రెండవ విడత సాయం నగదును తల్లుల అకౌంట్లలో డిపాజిట్ చేశారు. డిసెంబర్ లో మూడవ విడత, ఫిబ్రవరిలో నాలుగో విడత నిధులు విడుదల చేయనున్నారు. విద్యారంగంపై రూ. 26,577 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.