AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అందించారు. ఇకపై దళారులకు, పైరవీలకు తావు లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని సీఎం జగన్ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 10,143 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నేడు క్యాంప్ కార్యాలయంలో జాబ్ క్యాలెండర్ ను సీఎం జగన్ విడుదల చేశారు. మార్చి 2022 వరకూ భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను ఇందులో ప్రకటించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎళ్ల తరబడి శిక్షణ పొందుతూ ఎదురుచూస్తున్నారన్నారు. వాళ్లు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు ఉద్యోగాల భర్తీ చేస్తున్నామన్నారు. ఏ ఉద్యోగం ఏ నెలలో వస్తుందో తెలియజేసేందుకు క్యాలెండర్ విడుదల చేశామన్నారు. ఈ రెండేళ్ల కాలంలో ఏకంగా 6,03,701 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. వీటిలో శాశ్వత ప్రాతిపదికన 1,84,264, పొరుగు సేవలు 3,99,791, ఒప్పంద ఉద్యోగాలు 19,701 ఇచ్చామన్నారు. రూ.3,500 కోట్ల భారం పడుతున్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించామన్నారు. రాష్ట్రానికి ఆదాయం తగ్గినా, ప్రతి కూల పరిస్థితుల్లోనూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని జగన్ వెల్లడించారు.