విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతతో పాటు, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్లో పురోగతి, సివిల్ వర్క్స్, సుందరీకరణ పనులపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. స్మృతివనంతో పాటు విగ్రహ నిర్మాణ పనులపై ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయనీ, అన్ని స్లాబ్ వర్కులు ఈ నెలాఖరు నాటికి పూర్తి అవుతాయని తెలిపారు.

విగ్రహ విడిభాగాలు ఇప్పటికే సిద్దంగా ఉన్నాయనీ, ఒకొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. విగ్రహ నిర్మాణంలో మొత్తం 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. విగ్రహం తయారీతో పాటు దాని చుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే పనులను సీఎం కు అధికారులు వివరించారు. అధికారులు పనులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సీఎం జగన్ ఆదేశించారు.
స్మృతివనంలో ఏర్పాటవుతున్న కన్వెన్షన్ సెంటర్ కూడా అత్యంత ప్రధానమైనదన్నారు. పనుల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు శాశ్వతమైన ప్రాజెక్టు అని, పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలన్నారు. విజయవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా నిర్మాణాలు ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, సీఎస్ జవహర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ అభ్యర్ధులు