AP CM YS Jagan: ఏపి (Andhra Pradesh) విద్యా వ్యవస్థలో సంస్కరణల నేపథ్యంలో ఎయిడెడ్ విద్యాసంస్థల (Aided educational institutions) ను ప్రభుత్వం (AP Govt) స్వాధీనం చేసుకుని నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎయిడెడ్ పాఠశాలల గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిలుపుదలకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పలు ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఎయిడెడ్ విద్యాసంస్థల భూముల విలువ రూ. లక్షలు, కోట్లలో ఉండటంతో వారు ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు ఎయిడెడ్ విద్యాసంస్థలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు.
ఎయిడెడ్ విద్యాసంస్థల వివరాల సేకరణ
అందులో ప్రధానంగా పాఠశాల నడిపే ప్రదేశం. ఎప్పటి నుండి పని చేస్తోంది. కరస్పాండెంట్, అక్కడ పని చేస్తున్న బోధన బోధనేతర ఉద్యోగుల వివరాలు, వాటిల్లో శాంక్షన్ పోస్టులు, వారికి చెల్లిస్తున్న జీత భత్యాలు, పిల్లల ప్రవేశాలు, అది మైనార్టీ విద్యాసంస్థ. నాన్ మైనార్టీ విద్యాసంస్థా అనేవి సేకరించారు. అదే విధంగా విద్యాసంస్థలో మౌలిక సదుపాయాలు, ప్రస్తుతం భవనాల పరిస్థితి ఎలా ఉంది, పాఠశాలలో ఎన్ని తరగతులు ఎయిడెడ్ లో నడుస్తున్నాయి. భవనాలకు చెల్లిస్తున్న అద్దెలు, కరెంటు బిల్లు, ప్రయోగశాలలో పరిరకాల వివరాలు, పాఠశాల భూమికి సంబంధించి విలువ తదితర వివరాలను విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. స్వచ్చందంగా అప్పగించడానికి కొన్ని విద్యాసంస్థలు ముందుకు వస్తున్నాయి. అయితే స్వచ్చందంగా విద్యాసంస్థలు అప్పగించడానికి ఎంత మంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు అనే వివరాలను కూడా విద్యాశాఖ అధికారులు సేకరించారు.
AP CM YS Jagan: విద్యాసంస్థల అప్పగింతలో బలవంతం లేదు
ఈ నేపథ్యంలో సోమవారం విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్(CM YS Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తి స్వచ్చందం అని తెలిపారు. శిధిలావస్థలో, మౌలిక సదుపాయలు లేక విద్యార్ధులు, సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి వారికి ఒక అవకాశం ప్రభుత్వ పరంగా కల్పించామన్నారు. ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయా సంస్థలను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. లేదు తామే నడుపుకుంటామంటే బేషుగ్గా నడుపుకోవచ్చని, దీనికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఎయిడెడ్ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని అందరికీ స్పష్టం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.