రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలపై ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఏలూరు జిల్లా వరకూ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు సీఎం జగన్. గోదావరి వరద ఉదృతిపై వివరాలు అడిగి తెలుసుకుని సహాయక చర్యలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. దవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద 10లక్షల క్యూసెక్కులపైగా వరద వచ్చిందనీ, ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తొందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయానికి వరద పెరిగే అవకాశం ఉందన్నారు. 16 లక్షల క్యూసెక్కుల వరకూ చేరుకునే అవకాశం ఉన్నందున దీని వల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలని ఆదేశించారు సీఎం జగన్. వరద పరిస్థితి పై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
కూనవరం, చింతూరులో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయనీ, విఆర్ పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని, కంట్రోల్ రూమ్ లు సమర్ధవంతంగా పని చేయాలని ఆదేశించారు. అవసరమైన ప్రదేశాల్లో వరద సహాయక శిబిరాలను తెరవాలని ఆదేశించారు. వరద సహాయక శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలన్నారు. సహాయక శిబిరాల నుండి ఇళ్లకు వెళ్లే సమయంలో వారికి రూ.2వేల వంతున తక్షణ సాయం అందించాలని చెప్పారు. వరద ముంపు ప్రాంతాల్లో అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలనీ, విద్యుత్, త్రాగునీరు. పారిశుద్ధ్యం తదితర ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలనీ తెలిపారు. శిధిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, ఇరిగేషన్ కాలువలు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణ సహాయక చర్యల కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా, ఈస్ట్ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాలకు రెండు కోట్లు చొప్పున నాలుగు జిల్లాలకు రూ.8 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..అగ్రవర్ణాలకు కూడా..అర్హతలు ఇవీ